టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్.. ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నుంచి జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో అవకాశం అందుకున్న ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
ఆకాశ్ దీప్ వేసిన మూడో ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(0), ఓలీ పోప్(0) వరుసగా డకౌటయ్యారు. ఈ ఓవర్ నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో వేయగా డకెట్ పంచ్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి మూడో స్లిప్ ఫీల్డర్ శుభ్మన్ గిల్ దిశగా దూసుకెళ్లగా అతను ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు. ఆ మరుసటి బంతిని కూడా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లోనే వేయగా.. ఓలీ పోప్.. ఫ్లిక్ షాట్ ఆడాడు.

బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని సెకండ్ స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ వైపు దూసుకెళ్లింది. అయితే బంతి అతని చేతులు తాకి మిస్సైంది. కానీ రెండో ప్రయత్నంలో రాహుల్ క్యాచ్ పూర్తి చేశాడు. దాంతో ఇంగ్లండ్ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్.. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు తీసి అతను లేని లోటును తీర్చాడు. ఆ కాసేపటికే జాక్ క్రాలీ(19) సిరాజ్.. స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన జోరూట్, హ్యారీ బ్రూక్ ఆచితూచి ఆడుతున్నారు.
అంతకుముందు 310/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శుభ్మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్(103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసారు.