ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత సెలెక్షన్ కమిటీ ఛైర్మెన్ అజిత్ అగార్కర్ శనివారం వెల్లడించాడు. అందరూ ఊహించనట్లుగానే 25 ఏళ్ల శుభ్మన్ గిల్ను టీమిండియా టెస్ట్ కెప్టెన్గా ప్రకటించారు. రోహిత్ శర్మకు డిప్యూటిగా టీమిండియాను నడిపించిన జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ను చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపించినప్పటికీ..సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టేసారు. అతని స్థానంలో రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించారు.
బుమ్రాను తరుచుగా గాయాలు వెంటాడుతున్న నేపథ్యంలోనే అతన్ని లీడర్షిప్ గ్రూప్ను తప్పించినట్లు తెలుస్తోంది. అగార్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.'ఫిజియోలు, వైద్యులు చెప్పిన దాన్ని బట్టి బుమ్రా సిరీస్లో పూర్తిగా ఆడతాడని అనుకోవట్లేదు. మూడు లేదా నాలుగు.. ఎన్ని మ్యాచ్ల్లో ఆడతాడో చూడాలి'అని అగార్కర్ తెలిపాడు. శుభ్మన్ అద్భుతమైన క్రికెటర్ అని, ఏడాదిగా అతను నిలకడగా రాణిస్తున్నాడని గుర్తు చేశాడు.

చాలా ఏళ్లుగా జట్టులో కొనసాగిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారని, ప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉందన్న గవాస్కర్.. అనుభవంతో గిల్ మరింత రాటు దేలుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటర్గా అతను మరింత రాణించడానికి సారథ్య బాధ్యతలు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నామని తెలిపాడు. కుర్రాళ్లకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నాడు.
ఇండియా vs ఇంగ్లండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే..
మొదటి టెస్ట్ మ్యాచ్ (జూన్ 20-24)
రెండవ టెస్ట్ మ్యాచ్ (జూలై 2-6)
మూడవ టెస్ట్ మ్యాచ్ (జూలై 10-14)
నాల్గవ టెస్ట్ మ్యాచ్ (జూలై 23-27)
ఐదవ టెస్ట్ మ్యాచ్ (జూలై 31-ఆగస్టు 4)
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు ఇదే..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్( వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్.