ఇంగ్లండ్తో మూడో టెస్ట్లో టీమిండియా ఓటమికి టాపార్డర్ వైఫల్యం, రిషభ్ పంత్ రనౌటే కారణమని అందరూ భావిస్తుంటే.. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే మాత్రం మరో కారణం చెప్పాడు. రెండో ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ విఫలమవ్వడం టీమిండియా ఓటమిని శాసించిందని తెలిపాడు. అతను ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగడమే ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నాడు.
ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 193 పరుగుల లక్ష్యచేధనలో ఆదిలోనే యశస్వి జైస్వాల్ ఔటవ్వగా.. కరుణ్ నాయర్తో కలిసి రాహుల్ ఆచితూ ఆడాడు. క్రీజులో సెట్ అయిన తర్వాత బ్రైడన్ కార్స్ బౌలింగ్లో కరుణ్ నాయర్ ఎల్బీగా వెనుదిరిగాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు.

ఈ మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అజింక్యా రహానే.. కరుణ్ నాయర్ వికెట్తోనే ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. 'కరుణ్ నాయర్ వికెట్ ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. ఆ సమయంలో భారత్ 40/1తో పటిష్టంగా కనిపించింది. కానీ కరుణ్ నాయర్ వికెట్ తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ఇంగ్లండ్ గేమ్పై పట్టు బిగించింది. ఆ క్షణం నుంచి అద్భుతంగా బౌలింగ్ చేసింది. మైదానంలో, ఫీల్డింగ్లో ఇంటెన్సిటీ చూపించింది. గెలవాలనే కసితో బరిలోకి దిగింది.'అని అజింక్యా రహానే చెప్పుకొచ్చాడు.
8 ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఒక్క ఛాన్స్ అంటూ జట్టులోకి వచ్చిన అతను 6 అవకాశాలను వృథా చేశాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 0, 20, ఎడ్జ్బాస్టన్లో 31, 20, లార్డ్స్ టెస్ట్లో 40, 14 రన్స్తో నిరాశపర్చాడు. మొత్తం 6 ఇన్నింగ్స్ల్లో 135 పరుగులు చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో నాలుగో టెస్ట్లో అతనికి చోటు దక్కడం సందేహంగా మారింది. కరుణ్ నాయర్ను తప్పించి అతని స్థానంలో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్లను ఆడించే ఛాన్స్ ఉంది. జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.