సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. అభిషేక్ శర్మ(34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్లతో 79 ) విధ్వంసకర బ్యాటింగ్తో భారత్ సునాయస విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/21) రెండు వికెట్లు తీయగా..ఆదిల్ రషీద్కు ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం చెన్నై వేదికగా జరగనుంది.
సంజూ అదిరిపోయే ఆరంభం..
స్వల్ప లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ తొలి వికెట్కు 41 పరుగులు జోడించింది. భారీ షాట్ ఆడబోయి సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్(0) ఒకే ఓవర్లో వెనుదిరిగినా.. తిలక్ వర్మతో కలిసి అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేశారు. ఈ అవకాశంతో అతను చెలరేగిపోయాడు.
అభిషేక్ శర్మ ఊచకోత..
భారీ సిక్స్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. అనంతరం మరింత దూకుడుగా ఆడుతూ భారీ సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ శర్మను ఆదిల్ రషీద్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చినా.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(3 నాటౌట్)తో కలిసి తిలక్ వర్మ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.