టీమిండియా వికెట్ కీపర్, తెలుగు తేజం కేఎస్ భరత్కు మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అండగా నిలిచాడు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్ల్లో విఫలమైన కేఎస్ భరత్ను మూడో టెస్ట్లో తప్పిస్తారనే వార్తలపై తనదైన శైలిలో స్పందించాడు. తుది జట్టు నుంచి కేఎస్ భరత్ను తప్పించడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
బ్యాటింగ్లో విఫలమైనా... వికెట్ కీపర్గా కేఎస్ భరత్ సత్తా చాటుతున్నాడని, అతనికి కనీసం మరో అవకాశమైనా ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. ఇక తొలి రెండు టెస్ట్ల్లో కేఎస్ భరత్ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 17, 6, 41, 28 పరుగులే చేశాడు. వికెట్ కీపర్గా నాలుగు ఇన్నింగ్స్ల్లో 6 క్యాచ్లు అందుకున్నాడు.

బ్యాటింగ్లో విఫలమవుతున్న కేఎస్ భరత్పై వేటు వేసి యువ కీపర్ ధ్రువ్ జురెల్కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ధ్రువ్ జురెల్ అరంగేట్రం ఖాయమని పేర్కొన్నాయి. ఈ వార్తలపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు.
2 మ్యాచ్లకే తప్పిస్తారా..?:
రెండు మ్యాచ్లకే కేఎస్ భరత్ను తప్పించడం అన్యాయమన్నాడు. 'రాజ్కోట్ టెస్ట్లో ధృవ్ జురెల్ అరంగేట్ర చేస్తాడనే వార్తలు నా దృష్టికి వచ్చాయి. నేను ఇది కరెక్టా..? తప్పిదమా? అని ఆలోచిస్తున్నా. రెండు టెస్ట్లకే భరత్ను పక్కనపెట్టడం సరికాదు. అతను ఈ సిరీస్ మొత్తం ఆడాలనుకుంటున్నా. అతని నుంచి మెరుగైన బ్యాటింగ్ అంచనా వేస్తే కనీసం మరో అవకాశం అయినా ఇవ్వాలి.
వికెట్ కీపింగ్ కోసం మాత్రమే శ్రీకర్ భరత్ను తీసుకున్నారు. కాబట్టి కీపింగ్తోనే అతన్ని జడ్జ్ చేయాలి. తొలి రెండు టెస్ట్ల్లో అతను అద్భుతంగా కీపింగ్ చేశాడు. కఠినమైన పిచ్లపై కీపింగ్ అంత సులువైన పనికాదు. అందుకే కదా.. కేఎల్ రాహుల్ను కాదని కేఎస్ భరత్తో కీపింగ్ చేయిస్తున్నారు. స్పెషలిస్ట్ కీపర్ కావాలని చెప్పారు.
వికెట్ కీపర్గా ఆడించాలి..:
స్పెషలిస్ట్ కీపర్గా భరత్ తన ప్రతిభను చాటాడు. భరత్పై త్వరగా ఓ నిర్ణయానికి రావడం ఏ మాత్రం భావ్యం కాదు. రిషభ్ పంత్ తర్వాత వికెట్ కీపర్ల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. కాబట్టి శ్రీకర్ భరత్కు టీమ్మేనేజ్మెంట్ అండగా నిలవాలి. హైదరాబాద్ టెస్ట్లో కేఎస్ భరత్ రెండు ఇన్నింగ్స్ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
రెండో ఇన్నింగ్స్లో అతను కాసేపు క్రీజులో ఉండి ఉంటే ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించేది. కాబట్టి అతన్ని పక్కనపెడితే నేను తీవ్ర నిరాశకు గురవుతాను. కేఎస్ భరత్ను స్పెషలిస్ట్ కీపర్గానే ఆడించాలి. ఇప్పటికే జట్టులో ఉన్న ముగ్గురు స్పిన్నర్లు బ్యాటింగ్ సామర్థ్యం కలిగినవారే. జడేజా లేకున్నా.. అక్షర్ పటేల్, అశ్విన్ బ్యాటింగ్ చేయగలరు. లోయరార్డర్లో ఆడే భరత్ నుంచి పెద్ద స్కోర్లు ఆశించడం సరికాదు.'అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.