ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇరు జట్లు విశాఖపట్నం చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో వైజాగ్ పిచ్ క్యూరేటర్కు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచన చేశాడు.
ఈ మ్యాచ్కు టర్నింగ్ ట్రాక్ కాకుండా ఫ్లాట్ పిచ్ సిద్దం చేయాలని సూచించాడు. టర్నింగ్ ట్రాక్ సిద్దం చేస్తే బ్యాక్ ఫైర్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా బ్యాటర్లు సరైన ఫామ్లో లేరని, ఫ్లాట్ పిచ్ రెడీ చేయడమే ఉత్తమమని సూచించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'సెల్ఫ్ డౌట్ ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. మనం మంచి పిచ్ సిద్దం చేస్తే.. ఇంగ్లండ్ మన కంటే మెరుగ్గా ఆడుతోంది. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్తో సతమతమవుతున్నారు. కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. విరాట్ కోహ్లీ ఆడటం లేదు. రవీంద్ర జడేజా కూడా అందుబాటులో లేడు. టీమిండియా పరిస్థితి ఇబ్బందిగా ఉంది.
ఈ పరిస్థితుల్లో మంచి పిచ్ సిద్దం చేయడమే జట్టుకు శ్రేయస్కరం. అత్యుత్సాహంతో టర్నింగ్ పిచ్ చేస్తే బ్యాక్ ఫైర్ అవుతోంది. ఎందుకంటే భారత బ్యాటర్లు ఫామ్లో లేరు. అప్పుడు ఇరు జట్ల స్పిన్నర్లు సమంగా ప్రభావం చూపుతారు. టామ్ హార్ట్లీ బిషన్ బేడీలా.. జోరూట్ ముత్తయ్య మురళీదరణ్లా చెలరేగుతారు. సొంతగడ్డపై జరిగిన గత మూడు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవలేదు. రెండింటిలో ఓడి ఒక మ్యాచ్లో డ్రా అయ్యింది.

ఇండోర్లో ర్యాంక్ టర్నర్ సిద్దం చేయగా బ్యాక్ఫైర్ అయ్యింది. అశ్విన్, రవీంద్ర జడేజా ఉన్నా విజయం దక్కలేదు. అహ్మదాబాద్లో ఫ్లాట్ పిచ్ రెడీ చేయగా.. బోరింగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. హైదరాబాద్ పిచ్ మాత్రం బాగుంది. అలా ఉంచితే ఇంకా బాగుండేది. తొలి రోజు ఎక్కువ టర్న్ లభించింది.
హైదరాబాద్లో పేస్తో పాటు బౌన్స్ ఉంటుంది. కానీ హైదరాబాద్ పిచ్ సహజత్వాన్ని నాశనం చేసే ప్రయత్నం జరిగిందనిపించింది. ఇదే ఏ మాత్రం మంచిది కాదు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. వైజాగ్ టెస్ట్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని చోప్రా సూచించాడు.