హైదరాబాద్ టెస్ట్లో ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని తేలికగా తీసుకోవడమే టీమిండియా కొంపముంచిందని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా హోరాహోరీగా సాగిన తొలి టెస్ట్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకు కుప్పకూలింది. ఈ పరాజయంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. నాలుగో రోజు తొలి సెషన్ భారత్ ఓటమిని శాసించిందని అభిప్రాయపడ్డాడు. నాలుగో రోజు తొలి సెషన్లో ఓలీ పోప్, హార్ట్లీ అద్భుత బ్యాటింగ్తో కీలక భాగస్వామ్యం నెలకొల్పారని తెలిపాడు.

ఈ ఇద్దరూ క్విక్ సింగిల్స్తో సాధికారికంగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. భారత్ లక్ష్యం 200 ధాటితే చేధించడం కష్టమని ఆ సమయంలోనే కామెంటేటర్గా తాను చెప్పానని ఆకాశ్ చోప్రా గుర్తు చేశాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం 230 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధిస్తామనుకున్నామని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పడం చూస్తుంటే వారు ఈ లక్ష్యాన్ని పెద్దదిగా భావించలేదనే విషయం అర్థమవుతుందని తెలిపాడు.
ఇంగ్లండ్ను త్వరగా కట్టడి చేసుంటే ఫలితం భారత్కు అనుకూలంగా ఉండేదని చోప్రా చెప్పుకొచ్చాడు. నాలుగో రోజు 25.1 ఓవర్ ఆడిన ఇంగ్లండ్ మరో 104 పరుగులు చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ రెహాన్ను బుమ్రా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ త్వరగానే ముగుస్తుందని అంతా భావించారు. కానీ తొమ్మిదో స్థానంలో వచ్చిన హార్ట్లీ(34)తో కలిసి పోప్ 80 పరుగులు జోడించాడు. దాంతో ఇంగ్లండ్ ఆధిక్యం 200 ధాటింది. ఈ భాగస్వామ్యమే భారత ఓటమికి బాటలు వేసింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది.
రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) రాణించారు. దాంతో భారత్కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్తో 420 పరుగులు చేసింది. ఈ ఓటమితో ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా ప్రారంభం కానుంది.