ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అలసత్వం.. జోరూట్ అత్యుత్సాహం ఆ జట్టు ఓటమికి కారణమైందని టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. దూకుడుగా ఆడాలనే ఆలోచనతో జోరూట్ వికెట్ పారేసుకున్నాడని, లేజీగా పరుగెత్తి బెన్ స్టోక్స్ రనౌటయ్యాడని చెప్పాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
ఈ గెలుపుతో తొలి టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా ఐదు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. బెన్ స్టోక్స్, జోరూట్లపై విమర్శలు గుప్పించాడు. ఈ ఇద్దరూ బాధ్యతాయుతంగా పరిస్థితులకు తగ్గట్లు ఆడి ఉంటే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారేదన్నాడు.

'ఇంగ్లీష్ బ్యాటర్లు ఒకసారి పునరాలోచన చేయాలి. జోరూట్ ఆడిన షాట్ మరి నిర్లక్ష్యపూరితంగా ఉంది. జోరూట్ ఆ షాట్ ఆడకుండా ఉండి.. స్టోక్స్ రనౌట్ కాకపోయి ఉంటే మ్యాచ్ చివరి రోజు వరకు సాగేది. ఇంగ్లండ్కు గెలిచే అవకాశం ఉండేది. ఈ వికెట్పై 10 వికెట్లు తీయడం అంత సులువైన పనికాదు.
ఈ విషయంలో భారత అభిమానులు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్లు నిర్లక్షంగా ఔటవ్వకుంటే.. వారిని పెవిలియన్ చేర్చడం టీమిండియాకు కష్టమయ్యేది. జోరూట్ అయితే తన వికెట్ను చేజేతులా పారేసుకున్నాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ అలసత్వంగా పరుగెత్తి రనౌటయ్యాడు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(6/45) 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
ఫలితంగా భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.రెండో ఇన్నింగ్స్లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(104) ఒక్కడే సెంచరీ సాధించగా.. అక్షర్ పటేల్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదమవ్వగా.. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.
జాక్ క్రాలీ(132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 73) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బెన్ ఫోక్స్(69 బంతుల్లో 4 ఫోర్లు సిక్స్తో 36), టామ్ హార్ట్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.