ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో టీమిండియా దుమ్మురేపింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో సమష్టిగా రాణించి తొలి రోజు పై చేయి సాధించింది. మూడు సెషన్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత స్పిన్నర్ల ధాటికి మరోసారి తేలిపోయిన ఇంగ్లండ్.. తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57), రోహిత్ శర్మ(83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభ్మన్ గిల్(26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్కు ఓ వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు కుప్పకూలింది.

జాక్ క్రాలీ(108 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 79)ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెన్ డక్కెట్(27), ఓలీ పోప్(11), జోరూట్(26), జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0), టామ్ హార్ట్లీ(6), మార్క్ వుడ్(0)తీవ్రంగా నిరాశపరిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/72), 100వ టెస్ట్ హీరో రవిచంద్రన్ అశ్విన్(4/51) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.
పేస్కు అనుకూలంగా ఉండే ధర్మశాల మైదానంలో ర్యాంక్ టర్నర్ వికెట్ను రూపొందించారు. దాంతో భారత స్పిన్నర్లు చెలరేగారు.
ఓపెనర్ల జోరు..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్కు ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డక్కెట్(27) శుభారంభం అందించారు. భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ తొలి వికెట్కు 64 పరుగులు జోడించింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ సాయంతో రోహిత్ శర్మ విడదీసాడు.
కుల్దీప్ బౌలింగ్లో బెన్ డక్కెట్.. శుభ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. అతను భారీ షాట్కు ప్రయత్నించగా.. శుభ్మన్ వెనక్కి పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే ఓలిపోప్(11).. స్టెప్ ఔట్ అయ్యి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 100/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
చెలరేగిన కుల్దీప్ యాదవ్..
రెండో సెషన్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. కుల్దీప్ యాదవ్కు రవిచంద్రన్ అశ్విన్ కూడా జత కావడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. స్టన్నింగ్ డెలివరీతో జాక్క్రాలీని క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్.. నిలకడగా ఆడే ప్రయత్నం చేసిన జానీ బెయిర్ స్టో(29)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
ఆ వెంటనే జోరూట్(29)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించగా.. బెన్ స్టోక్స్ను కుల్దీప్ డకౌట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. టామ్ హార్ట్లీ(6), మార్క్ వుడ్(0)లను అశ్విన్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ 194/8 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
భారత్ దూకుడు..
మూడో సెషన్ ఆరంభంలోనే బెన్ ఫోక్స్(24), జేమ్స్ అండర్సన్(0)లను వరుస ఓవర్లలో ఔట్ చేసిన అశ్విన్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్కు తెరదించాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్.. బషీర్ బౌలింగ్లో భారీ సిక్సర్లు బాదగా.. రోహిత్ ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న యశస్వి దూకుడుగా ఆడే క్రమంలో బషీర్ బౌలింగ్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
అనంతరం శుభ్మన్ గిల్తో కలసి అర్థ సెంచరీ సాధించిన రోహిత్.. మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించాడు. రేపు మొత్తం భారత్ బ్యాటింగ్ చేస్తే.. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం దక్కుతుంది. ఒకవేళ ఫస్ట్ సెషన్లోనే ఆలౌటైతే మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది.