భారత్తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్లో ఇంగ్లండ్ తమ సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా కోచ్ల పేర్లను ప్రకటించింది. ఈ మ్యాచ్లో తమ సహాయక సిబ్బంది పాల్ కొల్లింగ్ వుడ్, మార్కస్ ట్రెస్కోథిక్లు సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా వ్యవరిస్తారని పేర్కొంది. దాంతో ఈ ఇద్దరూ కోచ్లు డ్రింక్స్ మోస్తూ కనిపించారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ప్లేయర్ల కొరతతో బాధపడుతోంది. ఓలీ రాబిన్సన్ లూజ్ మోషన్స్తో ఇబ్బందిపడుతుండటంతో అతన్ని చివరి టెస్ట్ నుంచి తప్పించి మార్క్వుడ్కు అవకాశం కల్పించారు. కొందరు ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత పనులతో స్వదేశం వెళ్లిపోయారు. దాంతో ఇంగ్లండ్ ఆటగాళ్ల సంఖ్య 14కు చేరింది.

ఐసీసీ నిబంధన ప్రకారం మ్యాచ్ ప్రారంభానికి ముందు గరిష్టంగా ఆరుగురు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ జట్టు తమ కోచింగ్ స్టాఫ్ను సబ్స్టిట్యూట్ ఫీల్డర్లుగా పేర్కొంది. దాంతో ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు అయిన కోలింగ్ వుడ్, ట్రెస్కోథిక్లు చివరి టెస్ట్లో సబ్స్టిట్యూట్ జెర్సీలను ధరించి డ్రింక్స్ మోస్తూ కనిపించారు.
ఆటగాళ్లు ఎక్కువగా గాయపడినప్పుడు.. అస్వస్థత గురైనప్పుడు సపోర్ట్ స్టాఫ్ సబ్స్టిట్యూట్లుగా బరిలోకి దిగడం గతంలో చాలా సార్లు జరిగింది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఇంగ్లండ్.. తమ సహాయక సిబ్బందితో ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా చేయించింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు టీమిండియా సత్తా చాటింది. ముందుగా బౌలింగ్లో చెలరేగి ఇంగ్లండ్ను 218 పరుగులకు ఆలౌట్ చేసింది. జాక్ క్రాలీ(108 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 79)మినహా అంతా విఫలమయ్యారు. బెన్ డక్కెట్(27), ఓలీ పోప్(11), జోరూట్(26), జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0), టామ్ హార్ట్లీ(6), మార్క్ వుడ్(0)తీవ్రంగా నిరాశపరిచారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(5/72) ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్(4/51) నాలుగు, జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58), రోహిత్ శర్మ(83 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. శుభ్మన్ గిల్(26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. షోయబ్ బషీర్కు ఓ వికెట్ దక్కింది.