ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడు. రివ్యూ తీసుకోమని సహచర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఎంత చెప్పినా వినలేదు. దాంతో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ(108 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 79) ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోహిత్ శర్మ తప్పిదం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్ వృథా అయ్యింది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ ఆఖరి టెస్ట్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. ఇక కుల్దీప్ యాదవ్ వేసిన 26 ఓవర్లో జాక్క్రాలీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఓవర్ ఐదో బంతి జాక్ క్రాలీ బ్యాట్ను ముద్దాడుతూ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ చేతిలోకి వెళ్లింది.

కానీ అతను అందుకోవడంలో విఫలమవ్వగా.. షార్ట్ లెగ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ సూపర్ డైవ్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. రివ్యూ తీసుకోవాలని సర్ఫరాజ్ ఖాన్, శుభ్మన్ గిల్ ఎంత చెప్పినా.. ధ్రువ్ జురెల్ సందేహం వ్యక్తం చేయడంతో రోహిత్ శర్మ నిరాకరించాడు.
కానీ రిప్లేలో అది ఔటని తేలింది. రివ్యూ తీసుకొని ఉంటే జాక్ క్రాలీ ఔటయ్యేవాడు. అప్పటికి అతను 61 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 12 ఓవర్ల తర్వాత జాక్క్రాలీని కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ వికెట్ మీద వేసిన బంతి 10.6 డిగీల్రు టర్న్ అయ్యి వికెట్లను లేపేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే రోహిత్ శర్మ, ధ్రువ్ జురెల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవారు.
ఈ మ్యాచ్లోనూ ఇంగ్లండ్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్(5/72) ధాటికి జాక్ క్రాలీ మినహా మరే బ్యాటర్ రాణించలేదు. బెన్ డక్కెట్(27), ఓలీ పోప్(11), జోరూట్(26), జానీ బెయిర్ స్టో(29), బెన్ స్టోక్స్(0), టామ్ హార్ట్లీ(6), మార్క్ వుడ్(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. క్రీజులో షోబయ్ బషీర్(4 బ్యాటింగ్), బెన్ ఫోక్స్(5 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ రెండు, జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.