
బర్మింగ్హామ్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్ మూడో రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగిస్తోన్నాడు. మ్యాచ్ తొలి రెండు రోజులు ఇబ్బంది పెట్టిన వర్షం.. మూడో రోజు కూడా అంతరాయం కలిగిస్తోంది. చిన్నపాటి చినుకులతో మొదలైన వాన పెద్దగా మారడంతో ఆటను నిలిపేసిన అంపైర్లు నిర్ణీత సమయం కన్నా ముందే లంచ్ బ్రేక్ ప్రకటించారు. వర్షం రాకతో అప్రమత్తమైన సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పేసారు.
85/5 ఓవర్నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(91 బ్యాటింగ్), సామ్ బిల్లింగ్స్(7 బ్యాటింగ్) ఉన్నారు. ఓవర్నైట్ బ్యాటర్, కెప్టెన్ బెన్ స్టోక్స్(25) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టోక్స్ ఇచ్చిన రెండు క్యాచ్లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అయినా ఈ అవకాశాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ అందిపుచ్చుకోలేకపోయాడు.
ఇక జానీ బెయిర్ స్టో మాత్రం టీ20 తరహా బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తిస్తున్నాడు. 65 బంతులకు 16 పరుగులు చేసిన బెయిర్ స్టో.. మరో 39 బంతుల్లో72 పరుగులు చేయడం విశేషం. మూడో రోజు ఆటలో భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా (194 బంతుల్లో 13 ఫోర్లతో 104) సెంచరీకి.. బుమ్రా (31 నాటౌట్;) 16 బంతుల్లో 4X4, 2X6) మెరుపులు తోడవడంతో స్కోరు 400 దాటింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లిష్ బౌలర్లలో అండర్సన్ (5/60) ఉత్తమ ప్రదర్శన చేశాడు.