ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదో టెస్ట్.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోకు ప్రత్యేకంగా నిలవనుంది. ధర్మశాల వేదికగా గురువారం(మార్చి 7) నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే అశ్విన్, జానీ బెయిర్ స్టోలకు ఇది కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్.
ఈ ఇద్దరు ధర్మశాల టెస్ట్ ఆడితే క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను అందుకోనున్నారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రత్యర్థి ఆటగాళ్లు ఇద్దరూ ఒకే మ్యాచ్లో 100వ టెస్ట్ మైలురాయి అందుకోవడం మూడో సారి మాత్రమే. 2006లో తొలిసారి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఈ ఫీట్ సాధించారు. సౌతాఫ్రికా పర్యటన 2006లో జరిగిన తొలి మ్యాచ్లో ఆతిథ్య స్టార్ బౌలర్ షాన్ పొలాక్, న్యూజిలాండ్ బ్యాటర్ స్టీఫెన్ ఫ్లేమింగ్.. 100వ మ్యాచ్ మైలు రాయి అందుకున్నారు.

ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ ఫీట్ సాధించారు. ఆసీస్ వేదికగా జరిగిన యాషెస్ 2013-2014 సిరీస్లో ఇంగ్లండ్కు చెందిన అలిస్టర్ కుక్, ఆతిథ్య జట్టుకు చెందిన మైఖేల్ క్లార్క్ 100వ టెస్ట్ ఆడి ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్.. చివరి టెస్ట్లో ఆ జట్టు స్టార్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో, ఆతిథ్య వెటరన్ స్పిన్నర్ అశ్విన్ 100వ టెస్ట్ ఆడేందుకు సిద్దమయ్యారు.
ఈ ఘనత సాధించిన మూడో జోడీగా చరిత్రకెక్కనున్నారు. 100 టెస్ట్లు ఆడిన 14వ భారత ఆటగాడిగా కూడా అశ్విన్ రికార్డ్ సాధించనున్నాడు. ఈ సిరీస్లోనే టెస్ట్ల్లో 500 వికెట్ల మైలు రాయి అందుకున్న అశ్విన్.. 100 టెస్ట్ మ్యాచ్లు ఘనతను అందుకునేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే అశ్విన్-జానీ బెయిర్ స్టోకు ధర్మశాల టెస్ట్ ప్రత్యేకమని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్కు గౌరవ ప్రదంగా కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని కూడా సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి వంటి దిగ్గజ ఆటగాళ్లు సూచించారు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. చివరి మ్యాచ్ను కూడా గెలిచి డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో తమ అగ్రస్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.
మరోవైపు చివరి మ్యాచ్లోనైనా గెలిచి విజయంతో భారత పర్యటనను ముగించాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది.