ఇంగ్లండ్తో ఐదో టెస్ట్లో టీమిండియా పుంజుకుంది. బ్యాటింగ్ తడబడిన భారత్.. బౌలింగ్లో దుమ్మురేపింది. మహమ్మద్ సిరాజ్(4/86), ప్రసిధ్ కృష్ణ(4/62) నాలుగేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ(57 బంతుల్లో 14 ఫోర్లతో 64), హ్యారీ బ్రూక్(64 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. బెన్ డకెట్(38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 43) దూకుడుగా ఆడాడు. తీవ్రంగా గాయపడిన క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు దిగలేదు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిధ్ కృష్ణతో పాటు ఆకాష్ దీప్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు 204/6 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 69.4 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్(109 బంతుల్లో 8 ఫోర్లతో 57), వాషింగ్టన్ సుందర్(55 బంతుల్లో 3 ఫోర్లతో 26) నిరాశపర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్(5/33) ఐదు వికెట్లు తీయగా.. జోష్ టంగ్(3/57) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్కు ఓ వికెట్ దక్కింది. ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో 23 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
ఇంగ్లండ్ ఓపెనర్ల బాజ్ బాల్ ఆట చూసిన తర్వాత ఈ మ్యాచ్లో టీమిండియా పుంజుకుంటుందని ఎవరూ అనుకోలేదు. కానీ భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ను కట్టడి చేశారు. ముఖ్యంగా సిరాజ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.

ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ బాజ్ బాల్ గేమ్తో తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించారు. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్, రివర్స్ స్కూప్ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. టీ20 తరహా బ్యాటింగ్తో చెలరేగారు. దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్ను ఆకాష్ దీప్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. క్రీజులోకి ఓలీ పోప్ రాగా.. 42 బంతుల్లో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే 109/1 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లో భారత బౌలర్లు జూలు విధిల్చారు. సెంచరీ దిశగా సాగిన జాక్ క్రాలీ(64)ని ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్ చేశాడు. ఆ కాపేసటికే ఓలీ పోప్ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ ద్వారా భారత్ ఈ ఫలితాన్ని రాబట్టింది. ఈ పరిస్థితుల్లో జోరూట్, హ్యారీ బ్రూక్ ఆచితూచి ఆడారు. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా మారడంతో ఇంగ్లండ్ పరుగుల వేగం తగ్గింది. ప్రమాదకర జోరూట్(22)ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే జాకోబ్ బెతెల్(6)ను కూడా సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు జెమీ స్మిత్(8), జెమీ ఓవర్టన్లను తన వరుస ఓవర్లలో ప్రసిధ్ కృష్ణ వెనక్కి పంపాడు. దాంతో ఇంగ్లండ్ 215/7 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
ఆఖరి సెషన్లో గస్ అట్కిన్సన్తో కలిసి హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. బౌండరీలతో జోరు కనబర్చిన అట్కిన్సన్ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు.జోష్ టంగ్(0 నాటౌట్) సాయంతో హ్యారీ బ్రూక్ భారీ షాట్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభం కాగా.. బ్రూక్ 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్ట్రైకింగ్ తీసుకుంటూ ఒంటరి పోరాటం చేశాడు. బ్రూక్ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.