ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్న ఈ మ్యాచ్లో విజయం ఇరు జట్లను ఊరిస్తోంది. నాలుగో రోజు ఆట అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలి సెషన్లో టీమిండియా పైచేయి సాధిస్తే.. రెండో సెషన్లో ఇంగ్లండ్ దుమ్మురేపింది. ఆఖరి సెషన్లో పుంజుకున్న భారత్.. ఇంగ్లండ్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సూరీడు ఇంటికెళ్లిపోవడంతో నిర్ణీత సమయం కన్నా ముందే మ్యాచ్ను ఆపేయాల్సి వచ్చింది.
మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. క్రీజులో జెమీ ఓవర్టన్(0 బ్యాటింగ్), జెమీ స్మిత్(2 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత్కు నాలుగు వికెట్లు కావాలి. గాయంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయని క్రిస్ వోక్స్.. అవసరమైతే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. గాయంతోనే బ్యాటింగ్ వచ్చేందుకు జెర్సీ వేసుకొని రెడీగా కనిపించాడు. దాంతో టీమిండియా విజయానికి నాలుగు వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్యాడ్ లైట్ టీమిండియాకు బ్యాడ్ లక్గా మారగా.. ఇంగ్లండ్కు కలిసొచ్చింది. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో బంతి రెండు వైపులా స్వింగ్ అయ్యింది. ఆట సజావుగా సాగి ఉంటే టీమిండియా బౌలర్లకు అడ్వాంటేజ్గా మారేది. నాలుగు ఓవర్ల తర్వాత కొత్త బంతి వచ్చేది. అప్పుడు బంతి మరింత స్వింగ్ అయ్యేది. కానీ బ్యాడ్ లైట్ టీమిండియా కొంపముంచింది. స్వింగ్ కండిషన్స్ భారత బౌలర్లు చెలరేగి ఇంగ్లండ్ బ్యాటర్ల పని పట్టేవారు.
374 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 50/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ డకెట్(54)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయగా.. కెప్టెన్ ఓలీ పోప్(27)ను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. పోప్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్, జో రూట్ ఇంగ్లండ్ను ఆదుకున్నారు.
19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న సిరాజ్.. సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు. ఈ అవకాశంతో చెలరేగిన బ్రూక్.. టీమిండియా(98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 111)ను శతక్కొట్టాడు. అతన్ని ఆకాష్ దీప్ ఔట్ చేయడంతో నాలుగో వికెట్కు నమోదైన 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆఖరి సెషన్ ఆరంభంలోనే జో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆకాష్ దీప్ వేసిన 69వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు. జోరూట్కు కెరీర్లో ఇది 39వ సెంచరీ. ఇంగ్లండ్ విజయమే లాంఛనమే అనుకుంటున్న తరుణంలో ప్రసిధ్ కృష్ణ తన వరుస ఓవర్లలో జాకోబ్ బెతెల్(5), జో రూట్(105)లను పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. జాకోబ్ బెతెల్ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రసిధ్.. జోరూట్ను కీపర్ క్యాచ్గా ఔట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్, ప్రసిధ్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో జెమీ స్మిత్, ఓవర్టన్ తడబడ్డారు. ఈ క్రమంలోనే బ్యాడ్ లైట్తో మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం రావడంతో నాలుగో రోజు ఆటను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.