టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో ఇంగ్లండ్పై వెయ్యికి పైగా పరుగుల చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన తొలి ఆసియా ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో అశ్విన్ ఈ ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ వికెట్తో ఇంగ్లండ్పై అశ్విన్ 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే బ్యాటింగ్లో ఇంగ్లండ్పై 1085 పరుగులు చేశాడు. ఓవరాల్గా టెస్ట్ల్లో ఇంగ్లండ్పై వెయ్యికి పైగా పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం సోబెర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన 3214 పరుగులతో పాటు 102 వికెట్లు తీసాడు.

ఆస్ట్రేలియా బౌలర్ నోబెల్ 1905 పరుగులతో పాటు 115 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాకే చెందిన జిఫ్పెన్ 1238 పరుగులతో పాటు 103 వికెట్లతో అశ్విన్ కన్నా ముందున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో నిప్పులు చెరగగా.. అశ్విన్, జడేజా తలో వికెట్ తీయడంతో ఫస్ట్ సెషన్లోనే ఐదు వికెట్లు కోల్పోయింది.
అశ్విన్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి బెయిర్ స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. అశ్విన్ పట్టుబట్టి మరీ రివ్యూ తీసుకొని ఫలితాన్ని రాబట్టాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన బెయిర్ స్టో(38) నిరాశగా పెవిలియన్ చేరాడు.