ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో మ్యాచ్లో టీమిండియా 182 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53), హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. రింకూ సింగ్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30), అభిషేక్ శర్మ(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 29)పర్వాలేదనిపించారు.
79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును 87 పరుగుల భాగస్వామ్యంతో హార్దిక్, శివమ్ దూబే ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్(3/35) మూడు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్(2/32) రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.

ఒకే ఓవర్లో 3 వికెట్లు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రెండో ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ నయా పేసర్ సకీబ్ మహమూద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసాడు. వరుసగా సంజూ శాంసన్(1), తిలక్ వర్మ(0)లను పెవిలియన్ చేర్చిన మహమూద్.. ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్(0)ను క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో భారత్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. మరోసారి షార్ట్ పిచ్ బాల్ను పుల్ షాట్ ఆడబోయి సంజూ శాంసన్ వికెట్ పారేసుకున్నాడు. తిలక్ వర్మ, సూర్య అనవసర షాట్లతో క్యాచ్ ఔటయ్యారు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, అభిషేక్ శర్మ జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆడపా దడపా బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో టీమిండియా 47 పరుగులు చేసింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని ఆదిల్ రషీద్ విడదీసాడు. అభిషేక్ శర్మను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 4వ వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆదుకున్న హార్దిక్, శివమ్ దూబే
క్రీజులోకి శివమ్ దూబే రాగా.. రింకూ సింగ్ ఆచితూచి ఆడాడు. అయితే రింకూ సింగ్ను బ్రైడన్ కార్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో 79 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా వరుస బౌండరీలతో దూకుడుగా ఆడాడు. శివమ్ దూబే కూడా భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదారు.
జేమీ ఓవర్టన్ వేసిన 18వ ఓవర్లో భారీ సిక్స్ బాదిన హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధాటిగా ఆడే క్రమంలో అదే ఓవర్లో వెనుదిరిగాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన శివమ్ దూబే..31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారీ షాట్ ఆడే క్రమంలో అక్షర్ పటేల్(2) ఔటవ్వగా.. అర్ష్దీప్ సింగ్ రనౌటయ్యాడు. క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో శివమ్ దూబే కూడా రనౌటవ్వడంతో టీమిండియా 181 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి.