భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో చెలరేగడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకే ఆలౌటైంది. కేఎల్ రాహుల్కు తోడుగా రిషభ్ పంత్(112 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 74), రవీంద్ర జడేజా(131 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(3/84) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(2/52), బెన్ స్టోక్స్(2/63) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులే చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమమై ఎవరికీ ఆధిక్యం దక్కలేదు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒకే ఓవర్లో వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(2 బ్యాటింగ్), బెన్ డకెట్(0 బ్యాటింగ్) ఉన్నారు. నాలుగో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు తీసే వికెట్లపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను త్వరగా ఆలౌట్ చేస్తే ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించవచ్చు. లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

145/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్కు ఓవర్నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడినా.. రిషభ్ పంత్ తనదైన ర్యాంప్ షాట్స్తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రిషభ్ పంత్ 86 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసిన పంత్ వేగంగా పరగులు రాబట్టాడు. రాహుల్ సైతం తనదైన క్లాస్ షాట్స్తో బౌండరీలు బాదాడు. తొలి సెషన్ ఆఖరి ఓవర్లో రిషభ్ పంత్ చేసిన తప్పిదం టీమిండియాకు నష్టం చేసింది. సెంచరీకి చేరువైన రాహుల్కు స్ట్రైక్ ఇవ్వాలనే ఆతృతలో పంత్ రిస్కీ సింగిల్ తీయబోయి రనౌటయ్యాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో భారత్ 248/4 స్కోర్ లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్ ఆరంభంలోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో క్విక్ సింగిల్ తీసిన రాహుల్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.అయితే ఆ సంతోషం ఎంతోసేపు లేదు. షోయబ్ బషీర్ వేసిన మరుసటి ఓవర్లోనే రాహుల్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డితో కలిసి రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో డిఫెన్స్కే పరిమితమైన ఈ జోడీ.. వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడింది. దాంతో భారత్ 316/5తో టీ బ్రేక్ వెళ్లింది.
ఆఖరి సెషన్ ఆరంభంలోనే నితీష్ రెడ్డిని బెన్ స్టోక్స్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 7వ వికెట్కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వాషింగ్టన్ సుందర్తో కలిసి జడేజా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 87 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేసిన జడేజాను క్రిస్ వోక్స్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 8వ వికెట్కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత ఆకాష్ దీప్(7) సిక్స్ బాదినా బ్రైడన్ కార్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా(0)ను క్రిస్ వోక్స్ ఔట్ చేయగా.. వాషింగ్టన్ సుందర్(23) ఆర్చర్ పెవిలియన్ చేర్చి భారత ఇన్నింగ్స్కు తెరదించాడు. 11 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 4 వికెట్లు కోల్పోయింది.
అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగగా.. బుమ్రా మూడో రోజు ఆటలోని చివరి ఓవర్ వేసాడు. ఈ ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ.. బుమ్రా బౌలింగ్ను ఫేస్ చేసేందుకు భయపడ్డాడు. పదే పదే టైమ్ వృథా చేసే ప్రయత్నం చేశాడు. దాంతో భారత ఆటగాళ్లు అతనితో వాగ్వాదానికి దిగారు. శుభ్మన్ గిల్ అయితే.. కాస్త ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు. సిరాజ్ కూడా తన నోటికి పనిచెప్పాడు. అంపైర్ కలగజేసుకొని ఆటగాళ్లను వారించారు.