
లీడ్స్: హెడింగ్లీ టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది... తొలి రోజు తమ బౌలింగ్తో భారత్ను దెబ్బ తీసిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్ జోరును చూపించింది. ఓపెనర్లు వేసిన బలమైన పునాదిపై వరుసగా మూడో టెస్టులోనూ సారథి జో రూట్ శతకంతో భారీ స్కోరుకు బాట వేశాడు. దాంతో ఇప్పటికే ఇంగ్లండ్ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్పై వరణుడు కనికరం చూపించడం లేదు. ఫస్ట్ టెస్ట్లో విజయాన్ని దూరం చేసిన వర్షం.. ఈ మ్యాచ్లోనూ అలానే అంతరాయం కలిగించి కోహ్లీసేనను గట్కెక్కించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. కానీ వరణుడు మాత్రం.. భారత్ విజయాన్ని అడ్డుకుంటానే తప్పా.. ఓటమి నుంచి ఎందుకు గట్కెక్కిస్తా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఆట మూడో రోజు శుక్రవారం వర్షం సూచనలేదు. పైగా లీడ్స్లో వాతావరణం పొడిగా ఉండనుంది. మరీ ముఖ్యంగా మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. పాక్షికంగా మబ్బులు ఉండనున్నాయి. ఈ రోజు లీడ్స్లో గరిష్టంగా 18 డిగ్రీలు.. కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్ష సూచన లేదని కూడా స్పష్టం చేసింది. అయితే అనుకూలమైన వాతావరణంలో కోహ్లీసేన ఎంత వరకు ఈ మ్యాచ్లో పోరాడగలదో చూడాలి. ఎండ కాస్తే కొంచెం బ్యాటింగ్కు అడ్వాంటేజ్ ఉంటుంది. మరి దీన్ని భారత్ ఎంతవరకు అందిపుచ్చుకుంటుందో. ఫస్ట్ ఇన్నింగ్స్ మాదిరి చెతులెత్తేస్తుందా? లేక నిలబడి గట్టెక్కుతుందా? అనే ఈ రోజు ఆట తర్వాత తేలనుంది.
రెండో రోజూ ఇంగ్లండ్దే! వాళ్ల ఆటతీరు బంతి నుంచి బ్యాట్కు బదిలీ అయింది తప్ప ఆడిన తీరు, క్రీజులో జోరు ఏమాత్రం తగ్గలేదు. పరుగుల హోరు ఆగలేదు. బ్యాటింగ్ వరుసలో టాపార్డర్ 'టాప్' ప్రదర్శన చేసింది. కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో14 ఫోర్లతో 121) మరో శతకంతో చెలరేగగా, డేవిడ్ మలాన్ (128 బంతుల్లో 11 ఫోర్లతో 70) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 129 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో నిలవగా, ఓవర్టన్ (24 బ్యాటింగ్), రాబిన్సన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.
మూడో రోజు ఆటలో కోహ్లీసేన అదరగొడితే మ్యాచ్లో నిలుస్తుంది. లేకుంటే రెండు రోజుల ఆట మిగిలుండగానే ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూడాల్సి వస్తుంది. ఫస్ట్ సెషన్లో వీలైనంత త్వరగా ఇంగ్లండ్ను ఆలౌట్ చేసి బ్యాటింగ్లో సత్తా చాటాలి. ముఖ్యంగా ఓపెనర్లు లార్డ్స్ టెస్ట్ మాదిరి ఆరంభం అందించాలి. ఆ తర్వాత కోహ్లీ, పుజారా, రహానే తన మార్క్ పెర్ఫామెన్స్తో బాటలు వేయాలి. చివర్లో రిషభ్ పంత్ తనదైన దూకుడుతో మంచి ఫినిషింగ్ ఇవ్వాలి. ఆస్ట్రేలియా గడ్డపై కనబర్చిన ఫామ్ను చూపించాలి. అప్పుడు లోయారార్డర్లో అడపాదడపా చేసిన భారత్ భారీ స్కోర్ చేస్తుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలన్నా, డ్రా చేసుకోవాలన్నా రెండో ఇన్నింగ్స్లో కనీసం 600కి పైగా పరుగులు చేయడంతో పాటు నాలుగో రోజు వరకు క్రీజులో నిలబడాలి. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.