ఇంగ్లండ్తో మూడో టెస్ట్ నాలుగో రోజు ఆటలోనూ భారత బౌలర్లు దుమ్మురేపారు. వాషింగ్టన్ సుందర్(4/22) నాలుగు వికెట్లతో రఫ్పాడించడంతో 2/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(96 బంతుల్లో ఫోర్తో 40), బెన్ స్టోక్స్(96 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో సుందర్కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా(2/38), మహమ్మద్ సిరాజ్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలో వికెట్ పడగొట్టారు. దాంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నమోదైంది.

2/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు దెబ్బతీసారు. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లను సిరాజ్ పెవిలియన్ చేర్చితే జాక్ క్రాలీ(22)ని నితీష్ కుమార్ రెడ్డి ఔట్ చేశాడు. హ్యారీ బ్రూక్(23)ను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, జో రూట్ ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు. దాంతో ఇంగ్లండ్ 98/4 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లోనూ జోరూట్, బెన్ స్టోక్స్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ కండిషన్స్ తగ్గట్లు నిదానంగా ఆడారు. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. మరోవైపు భారత బౌలర్లు పదే పదే ఇంగ్లండ్ బ్యాటర్లను బీట్ చేశారు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్లో స్టోక్స్, జోరూట్ తీవ్రంగా తడబడ్డారు. స్టోక్స్ అయితే పదే పదే బంతులను తన శరీరానికి తాకించుకున్నాడు. రెండో సెషన్ ముగుస్తుందనగా.. వాషింగ్టన్ సుందర్ బ్రేక్ త్రూ అందించాడు. జిడ్డు బ్యాటింగ్తో హాఫ్ సెంచరీ దిశగా సాగిన జోరూట్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్(8)ను కూడా వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 175/6 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
ఆఖరి సెషన్ ఆరంభంలోనే బెన్ స్టోక్స్(33) కూడా వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే బ్రైడన్ కార్స్(1)ను బుమ్రా తన మార్క్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో క్రిస్ వోక్స్(10) కూడా బుమ్రా బౌల్డ్ చేయగా.. షోయబ్ బషీర్(2)ను సుందర్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు. సుందర్ తీసిన నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్ ద్వారానే లభించడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో మొత్తం ఏడుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది.