ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131), రవీంద్ర జడేజా(212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 110 బ్యాటింగ్) శతకాలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 86 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.
ఈ ఇద్దరితో పాటు అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 62) మెరుపు హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్(1 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(3/69) మూడు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి సెషన్లో తడబడినా... చివరి రెండు సెషన్లలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

ఆ ముగ్గురు విఫలం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. మార్క్వుడ్ వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్(10), శుభ్మన్ గిల్(0)లను పెవిలియన్ చేర్చాడు. 2 బౌండరీలతో జోరు కనబర్చిన యశస్వి జైస్వాల్ను స్లిప్ క్యాచ్గా బోల్తా కొట్టించిన మార్క్వుడ్.. శుభ్మన్ గిల్(0) కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్(5)ను టామ్ హార్ట్లీ ఔట్ చేయడంతో 33 పరుగులకే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో రోహిత్ ఆచితూచి ఆడాడు. టామ్ హార్ట్లీ వేసిన 13వ ఓవర్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో జో రూట్ నేలపాలు చేశాడు. దాంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతనికి లైఫ్ లభించింది.
ఈ అవకాశంతో రోహిత్ చెలరేగాడు. ఈ క్రమంలో 71 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 93/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రోహిత్-జడేజా జోరు..
సెకండ్ సెషన్లో రోహిత్, జడేజా తమ ఆధిపత్యం చెలాయించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ.. వీలుచిక్కిన బంతిని బౌండరీలకు తరలించింది. బెన్ స్టోక్స్ ఫీల్డ్ మార్చినా.. బౌలింగ్లో మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. ఇద్దరూ పోటాపడి పరుగులు చేయడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో జడేజా 97 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 185/3 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
రోహిత్, జడేజా శతకం..
మూడో సెషన్లో రోహిత్ తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్స్తో ఆధిపత్యం చెలాయించాడు. ఈ క్రమంలో 157 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్కు ఇది 11వ టెస్ట్ సెంచరీ. శతకం అనంతరం మరింత ధాటిగా ఆడిన రోహిత్.. మార్క్ వుడ్ బౌలింగ్లో పుల్ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 204 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. తనదైన శైలిలో స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఆచితూచి ఆడిన జడేజా.. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అనవసర సింగిల్కు ప్రయత్నించి సర్ఫరాజ్ ఖాన్ రనౌట్కు కారణమయ్యాడు.
మరుసటి బంతికి సింగిల్ తీసిన జడేజా 198 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడగా.. మరో వికెట్ పడకుండా జడేజా తొలి రోజు ఆటను ముగించాడు.