ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్కు రెండు వికెట్లు దక్కాయి.

ఆరంభంలోనే షాక్..
326/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలోనే ఓవర్నైట్ బ్యాటర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఔటయ్యారు. అండర్సన్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేరగా.. జోరూట్ వేసిన మరుసటి ఓవర్లో జడేజా రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఇద్దరూ తమ ఓవర్ నైట్ స్కోర్కు చెరో రెండు పరుగులు మాత్రమే జోడించారు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్, ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ధ్రువ్ జురెల్ సెహ్వాగ్ తరహాలో భారీ సిక్సర్లు బాదాడు. మిడిల్ పిచ్పై పరుగెత్తిన అశ్విన్ను మందలించిన అంపైర్.. 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. ఈ విషయంపై అంపైర్తో అశ్విన్ వాగ్వాదానికి దిగాడు. ఇక భారత్ 388/7 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే రవిచంద్రన్ అశ్విన్(37)ను రెహాన్ అహ్మద్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో 8వ వికెట్కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన ధ్రువ్ జురెల్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్(3 నాటౌట్)తో కలిసి బుమ్రా ధాటిగా ఆడాడు. మూడు బౌండరీలు ఓ సిక్సర్ సాయంతో చివరి వికెట్కు 30 పరుగులు జోడించాడు.