ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. 10 రోజుల విశ్రాంతి అనంతరం గురువారం నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్ట్లో పర్యాటక ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఇరు జట్లు రాజ్కోట్ చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.
వైజాగ్ టెస్ట్లో సాధించిన గెలుపు ప్రదర్శననే ఈ మ్యాచ్లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తుండగా.. సీనియర్ల గైర్హాజరీలో బరిలోకి దిగుతున్న ఆతిథ్య జట్టును ఓడించాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. చివరి మూడు టెస్ట్లకు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ దూరమవ్వగా.. మూడో టెస్ట్ నుంచి రాహుల్ తప్పుకున్నాడు. దాంతో టీమిండియా కుర్రాళ్లతో బరిలోకి దిగే పరిస్థితి నెలకొంది.

అనుభవం లేని ఆటగాళ్లు..:
వ్యక్తిగత కారణాలతో కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరమవ్వగా.. పేలవ ఫామ్తో శ్రేయస్ అయ్యర్ జట్టులో చోటు కోల్పోయాడు. గాయం నుంచి రాహుల్ పూర్తిగా కోలుకోకపోవడంతో రాజ్కోట్ టెస్ట్ ఆడటం లేదు. అతని స్థానంలో జట్టులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ ఒక్కడికే 56 టెస్ట్లు ఆడిన అనుభవం ఉండగా.. గిల్ 22 టెస్ట్లు ఆడాడు.
మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా కనీసం 10 మ్యాచ్లు ఆడలేదు. రాజ్కోట్ పిచ్ పూర్తి ఫ్లాట్గా కనిపిస్తున్న నేపథ్యంలో పరుగుల వరద పారే అవకాశం ఉంది. మూడో రోజు నుంచి టర్నింగ్ లభించవచ్చు. పేసర్లు రివర్స్ స్వింగ్పై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
కుర్రాళ్లు అరంగేట్రం..:
రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. శుభ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో గత మ్యాచ్లో అరంగేట్రం చేసిన రజత్ పటీదార్ ఆడనుండగా.. ఐదో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఆరోస్థానంలో యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అరంగేట్రం చేయనున్నాడు.
తొలి రెండు మ్యాచ్ల్లో కేఎస్ భరత్ విఫలమవడంతో అతనిపై టీమ్మేనేజ్మెంట్ వేటు వేసే అవకాశం ఉంది. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, 8వ స్థానంలో అశ్విన్ ఆడనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారా? లేక అక్షర్ పటేల్ను కొనసాగిస్తారా? అనేది చూడాలి. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు ఆడనున్నారు.

రివర్స్ స్వింగ్ చేయగల ఆకాశ్ దీప్ను ఆడించాలనుకుంటే సిరాజ్ బెంచ్కే పరిమితమవుతాడు. అదే జరిగితే రేపటి టెస్ట్లో భారత్ తరఫున ముగ్గురు ప్లేయర్లు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నారు.
భారత తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్/సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్/ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్.