భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్పై పట్టు బిగించిన టీమిండియా.. బ్యాటింగ్లో మాత్రం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. 193 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(33) ఉండగా.. యశస్వి జైస్వాల్(0), కరుణ్ నాయర్(14), శుభ్మన్ గిల్(6) మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. నైట్వాచ్మన్గా బరిలోకి దిగిన ఆకాశ్ దీప్(1) కూడా ఔటయ్యాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీసారు. భారత్ విజయానికి ఇంకా 135 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్కు 6 వికెట్లు కావాలి. పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు ప్రతికూలంగా మారింది. ఆఖరి రోజు ఆట తొలి సెషన్ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించనుంది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

అంతకుముందు 2/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(96 బంతుల్లో ఫోర్తో 40), బెన్ స్టోక్స్(96 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో సుందర్కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా(2/38), మహమ్మద్ సిరాజ్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలో వికెట్ పడగొట్టారు. దాంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నమోదైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది.