ఇంగ్లండ్తో మూడో టెస్ట్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. రెండో టెస్ట్ గెలుపు జోరును కొనసాగిస్తూ.. ఆతిథ్య జట్టును ఉక్కిరి బిక్కిరి చేసింది. లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది. ఓవైపు జస్ప్రీత్ బుమ్రా.. మరోవైపు సిరాజ్, ఆకాశ్ దీప్.. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడింది. బజ్బాల్ గేమ్ను పక్కన పెట్టి బచ్గయా ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్ల ధాటికి దూకుడును పక్కన పెట్టి.. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో అభిమానులకు బోర్ తెప్పించింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. జో రూట్(191 బంతుల్లో 9 ఫోర్లతో 99 బ్యాటింగ్) ఇంగ్లండ్ను ఆదుకోగా.. బెన్ స్టోక్స్(39 బ్యాటింగ్) అండగా నిలిచాడు. ఓలీ పోప్(44) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీయగా.. జడేజా, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్ల ఎలా రాణిస్తారన్నది మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బజ్బాల్ శకంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఆరంభంలో పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్ను భారత బౌలర్లు ఉపయోగించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ ఓపెనర్లు తీవ్రంగా తడబడ్డారు. డిఫెన్స్కే పరిమితమయ్యారు. బౌలింగ్ చేంజ్గా బంతిని అందుకున్న నితీష్ కుమార్ రెడ్డి తొలి ఓవర్లోనే బెన్ డకెట్(23), జాక్ క్రాలీ(18)లను పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరూ కీపర్ క్యాచ్గా వెనుదిరిగారు. క్రీజులోకి వచ్చిన జోరూట్, ఓలీ పోప్ జాగ్రత్తగా ఆడారు. దాంతో ఇంగ్లండ్ 83/2తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. తొలి సెషన్లో ఇంగ్లండ్ 3.32 రన్రేట్ మాత్రమే నమోదు చేసింది. మెక్కలమ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సెషన్లో ఇంగ్లండ్ నమోదు చేసిన అతి తక్కువ రన్రేట్ ఇదే.

తొలి సెషన్లో ఇరు జట్లు సమంగా నిలవగా.. రెండో సెషన్లో మాత్రం ఇంగ్లండ్ పైచేయి సాధించింది. పట్టుదలగా ఆడిన జోరూట్, ఓలీ పోప్ అజేయంగా రెండో సెషన్ ముగించాడు. చాలా ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ.. పరుగులకంటే వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దాంతో ఈ సెషన్లో ఇంగ్లండ్ 24 ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేసింది. సంప్రదాయ ఆటతో రిస్క్ ఫ్రీ షాట్స్ ఆడారు. నితీష్ బౌలింగ్లో ఫైన్ లెగ్లో బౌండరీ బాది రూట్ 102 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి పోప్ అండగా నిలవడంతో ఇంగ్లండ్ 153/2తో టీ బ్రేక్కు వెళ్లింది.
చివరి సెషన్లో తొలి బంతికే ఓలీ పోప్ను జడేజా పెవిలియన్ చేర్చాడు. కీపర్ క్యాచ్గా ఔట్ చేయడంతో మూడో వికెట్కు నమోదైన 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్(11)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 172 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ బెన్ స్టోక్స్తో కలిసి జోరూట్ ఆచితూచి ఆడాడు. అతనికి స్టోక్స్ అండగా నిలిచాడు. సింగిల్స్కు మాత్రమే పరిమితమైన ఈ జోడీ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ఈ జోడీని విడదీసేందుకు గిల్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫీల్డ్ సెటప్ మార్చినా.. బౌలర్లందర్నీ ఉపయోగించినా ఫలితం దక్కలేదు.