భారత్ జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో వరుస పరాజయాలతో చతికిలపడిన ఇంగ్లండ్ మరో కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టీ20లో ఆతిథ్య టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు టీ20ల్లో ఓటమిపాలైనా మ్యాచ్కు 24 గంటల ముందే తుది జట్టును ప్రకటించింది.
తొలి రెండు మ్యాచ్లకు కూడా ఇంగ్లండ్ ఇలానే మ్యాచ్కు 24 గంటల ముందే తుది జట్టు వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మరోసారి తన దూకుడును కనబర్చాడు. రెండు మ్యాచ్ల్లో ఓడినా మెక్కల్లమ్ వెనకడుగు వేయడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లో చిత్తయిన ఇంగ్లండ్.. చెన్నై వేదికగా హోరాహోరీగా సాగిన రెండో టీ20లో మాత్రం తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఈ క్రమంలోనే మూడో టీ20కి ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నై టీ20లో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించింది. ఈ మ్యాచ్తోనే జట్టులోకి వచ్చిన జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. దాంతో వారిని జట్టులో కొనసాగించింది.
తొలి రెండు మ్యాచ్ల్లో దారుణంగా విఫలమైన ఫిల్ సాల్ట్, బెన్ డకెట్లకు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. విధ్వంసకర ఓపెనర్ అయిన ఫిల్ సాల్ట్.. తొలి రెండు టీ20ల్లో వరుసగా 0, 6 పరుగులు మాత్రమే చేశాడు. బెన్ డకెట్ 4, 3 పరుగులే చేసి వెనుదిరిగాడు.
విధ్వంసకర ఆల్రౌండర్ లైమ్ లివింగ్ స్టోన్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. తొలి టీ20లో డకౌట్ అయిన అతను రెండో టీ20లోనూ నిరాశపరిచాడు. అతని వైఫల్యం ఇంగ్లండ్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ బౌలింగ్ను ఇంగ్లండ్ ఆడలేకపోతుంది.
కనీసం మూడో టీ20లోనైనా రాణించి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. మరోవైపు తొలి రెండు మ్యాచ్ల తరహాలోనే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఇంగ్లండ్ తుది జట్టు:
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్(కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.