ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియా 357 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 112) సెంచరీతో కదం తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ శతకానికి తోడుగా విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(4/64) నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. సకీబ్ మహ్మూద్, గస్ అట్కిన్సన్, జోరూట్ తలో వికెట్ తీసారు.

రోహిత్ విఫలమైనా..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(1) వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ బౌలింగంలో రోహిత్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత.. దూకుడుగా బ్యాటింగ్ చేసింది. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి భారత్ 52 పరుగులు చేసింది.
కోహ్లీ అర్థ శతకం..
అనంతరం ఇదే జోరును కనబర్చిన కోహ్లీ, గిల్ వేగంగా పరుగులు చేసారు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ 51 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. విరాట్ కోహ్లీ 50 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని విడదీసేందుకు బట్లర్.. ఆదిల్ రషీద్ను రంగంలోకి దింపాడు. అతను కోహ్లీని కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడంతో రెండో వికెట్కు నమోదైన 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ రాగా.. శుభ్మన్ గిల్ తన జోరును కొనసాగించాడు.
శుభ్మన్ గిల్ సెంచరీ..
భారీ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను 95 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ కాపేపటికే శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ హీరో శుభ్మన్ గిల్ను ఆదిల్ రషీద్ క్లీన్ బౌల్డ్ చేసి మూడో వికెట్కు నమోదైన 104 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ కాసేపటికే శ్రేయస్ అయ్యర్ కూడా ఔటవ్వగా.. హార్దిక్ పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్లు బాది రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మరోవైపు కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడి జట్టు స్కోర్ను 300 ధాటించాడు. అక్షర్ పటేల్(13), కేఎల్ రాహుల్(40) వెను వెంటనే ఔటవ్వగా.. వాషింగ్టన్ సుందర్(14), హర్షిత్ రాణా(13) దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. ఆఖరి బంతికి అర్ష్దీప్ సింగ్ కూడా రనౌటవ్వడంతో భారత్ ఆలౌటైంది.