
మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పర్యటన చివరి అంకానికి చేరింది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టీ20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. అదే ఊపులో వన్డే సిరీస్ను గొప్పగా ఆరంభించినా.. రెండో మ్యాచ్లో ఎదురు దెబ్బ తప్పలేదు. ఇప్పుడిక పర్యటనలో చివరి పోరు, వన్డే సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో మ్యాచ్కు వేళైంది. నేడు జరిగే మూడో వన్డేలో సత్తా చాటేందుకు భారత్, ఇంగ్లండ్ సన్నద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ను 10 వికెట్ల తేడాతో గెలిచి రెండో మ్యాచ్లో 100 పరుగులతో ఓడిన రోహిత్ సేన చివరి సమరంలో సత్తా చాటుతుందా చూడాలి.
మాంచెస్టర్లో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా ఈ నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. అయితే 2019 వన్డే ప్రపంచకప్ ఓటమి తర్వాత మళ్లీ ఈ వేదికపై టీమిండియా వన్డే మ్యాచ్ ఆడుతోంది. న్యూజిలాండ్తో జరిగిన నాటి సెమీ ఫైనల్లో భారత్ అనూహ్యంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన నాటి మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యమే టీమిండియా కొంపముంచింది. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం దక్కలేదు.
ఈ క్రమంలోనే ఓల్డ్ ట్రాఫోర్డ్ రికార్డ్స్ భారత్ను కలవరపెడుతున్నాయి. అయితే ఈ రికార్డ్స్ భారత్కు అంత గొప్పగా.. మరీ అంత చెత్తగా కూడా లేవు. ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ 11 మ్యాచ్లు ఆడిన భారత్ ఐదింటిలో గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడింది. చివరగా ఇంగ్లండ్తో నాలుగు వన్డేలాడి ఒక్క మ్యాచే నెగ్గింది. మూడింట్లో ఆతిథ్య జట్టు గెలిచింది. ఇప్పుడిదే భారత్ను కలవరపెడుతోంది. ఈ వికెట్పై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లకే అడ్వాంటేజ్ ఉంటుంది.
ఈ పిచ్ బ్యాట్స్మెన్, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడ చివరగా జరిగిన 9 వన్డేల్లో ఎనిమిదిసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఈ 9 మ్యాచ్ల్లో ఆరుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 290+ స్కోర్లు చేసింది. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ తీసుకుంటుంది. మరీ భారత్ చెత్త రికార్డులను చెరపేసి విజయాన్నందుకుంటుందో లేక పరాజయాల పరంపరను కొనసాగిస్తుందో చూడాలి.