వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో ఎట్టకేలకు టీమిండియా విజయాన్ని అందుకుంది. వైజాగ్ టెస్ట్లో సమష్టిగా రాణించి ఇంగ్లండ్ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో హైదరాబాద్ టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.
వైజాగ్ టెస్ట్లో గెలిచినా.. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ కైవసం చేసుకోవాలంటే టీమిండియా మూడు విషయాల్లో మెరుగవ్వాలి. ఈ మూడు అంశాల్లో మెరుగైతేనే చివరి మూడు టెస్ట్ల్లో టీమిండియా ఆశించిన ఫలితాలను అందుకుంటోంది. లేకుంటే హైదరాబాద్ టెస్ట్ గతే పడుతోంది.

1.మిడిలార్డర్ బలోపేతం..
బలహీనంగా ఉన్న భారత మిడిలార్డర్ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెటరన్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు అందుబాటులో లేకపోవడంతో టీమిండియా మిడిలార్డర్ తడబడుతోంది.
రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్లు దారుణంగా విఫలమవుతున్నారు. మూడో టెస్ట్కు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అందుబాటులోకి వస్తే పరిస్థితి కాస్త మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ మిడిలార్డర్ బలహీనతను అధిగమిస్తే టీమిండియాకు తిరుగుండదు.
2. గాయాల బెడద..
ప్రస్తుతం భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. సిరీస్ ప్రారంభానికి ముందు చీలమండ గాయంతో మహమ్మద్ షమీ దూరమవ్వగా.. తొలి టెస్ట్లో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్లు గాయపడ్డారు. సీనియర్ ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో వారి స్థానాలను యువ ఆటగాళ్లతో భర్తీ చేయడం టీమిండియా మేనేజ్మెంట్కు సవాల్గా మారింది.
షమీ, జడేజా ఈ సిరీస్ మొత్తానికి దూరం కానుండగా.. రాహుల్ మూడో టెస్ట్కు అందుబాటులోకి రానున్నాడు. రెండో టెస్ట్లో చేతి వేలి గాయానికి గురైన శుభ్మన్ గిల్ గురించి సరైన అప్డేట్ లేదు. గాయాల బెడదను సరిగ్గా సమన్వయం చేయకపోతే టీమిండియాకు నష్టం జరగనుంది. గాయాలతో ఆటగాళ్లు దూరమైతే వారిస్థానాల్లో సరైన ఆటగాళ్లను తీసుకోవాలి.
3. స్పిన్నర్లు మరింత ప్రభావం చూపాలి..
తొలి రెండు టెస్ట్ల్లో భారత స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. పర్యాటక జట్టులో అనుభవం లేని స్పిన్నర్లు కూడా వికెట్లు తీయగా.. భారత జట్టులో స్టార్ స్పిన్నర్లు తడబడ్డారు. అశ్విన్ కాస్త పర్వాలేదనిపించినా.. అక్షర్ పటేల్ తేలిపోయాడు. దారళంగా పరుగులిచ్చాడు. కుల్దీప్ యాదవ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.
కానీ ఇంగ్లండ్ జట్టులో టామ్ హార్ట్లీ, జోరూట్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. భారత స్పిన్నర్లు మరింత కట్టడిగా బౌలింగ్ చేస్తే తిరుగుండదు.