ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు టీమిండియా పేసర్లు రెడ్, వైట్ బాల్తో ప్రాక్టీస్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలం వైట్ బాల్ క్రికెట్ ఆడిన భారత ఆటగాళ్లు ఆ అలవాట్లను వదిలించుకోవడంతో పాటు టెస్ట్ క్రికెట్కు అవసరమైన ప్రాథమిక బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు రెండు బంతులతో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత పేసర్లు ఎక్కువగా వైట్బాల్ క్రికెట్ ఆడారు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఇంగ్లండ్తో వన్డే, టీ20 సిరీస్ ఆడిన టీమిండియా.. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడింది. అనంతరం రెండు నెలల పాటు ఐపీఎల్ 2025 సీజన్ జరగ్గా.. భారత పేసర్లంతా ఈ మెగా టోరనీ ఆడారు.

వైట్బాల్ ఫార్మాట్లో బౌలర్లు తరచుగా వికెట్లు తీయడం లేదా పరుగులు కట్టడి చేయడంపై మాత్రమే దృష్టి పెడతారు. అందుకోసం బౌలింగ్లో వేరియేషన్స్ చూపించే ప్రయత్నం చేస్తారు. స్లో బాల్స్, షార్ట్ పిచ్ డెలివరీలను సంధిస్తుంటారు. అయితే టెస్ట్ క్రికెట్ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. సుదీర్ఘ ఫార్మాట్లో బౌలర్లు ఎక్కువగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్లో వికెట్లు తీయాలంటే సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడంతో పాటు బంతిని స్వింగ్ చేయాలి. సీమ్ను ఉపయోగించి బంతిని స్వింగ్ చేసే నైపుణ్యం తెలియాలి. అయితే వైట్ బాల్ క్రికెట్ అలవాట్లు రెడ్ బాల్ క్రికెట్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
ఉదాహరణకు వైట్-బాల్తో ఎక్కువ స్వింగ్ చేయలేం. బంతిపై ఉన్న సీమ్ త్వరగా దెబ్బతింటుంది. కానీ రెడ్-బాల్ క్రికెట్లో బంతి అంత త్వరగా దెబ్బతినదు. అంతేకాకుండా రెడ్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది.
ఈ క్రమంలోనే భారత పేసర్లకు రెడ్ బాల్, వైట్ బాల్ వ్యత్యాసం తెలియజేసేందుకు రెండు బంతులతో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించినట్లు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తెలిపారు. ఈ ప్రాక్టీస్ వల్ల టెస్ట్ ఫార్మాట్కు సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలిసొస్తాయని చెప్పారు. వైట్ బాల్ ఫార్మాట్పై వ్యూహాలు పనికిరావని, టెస్ట్ క్రికెట్లో లైన్ అండ్ లెంగ్త్, సీమ్ పొజిషన్, స్వింగ్ చేయడం ఎంత ముఖ్యమో అనే విషయం ఆటగాళ్లకు అర్థమవుతుందన్నారు. వైట్ బాల్ ఆరంభంలో మాత్రమే స్వింగ్ అయితే.. రెడ్ బాల్ ఎక్కువ సేపు స్వింగ్ చేయవచ్చనే విషయం కూడా ఆటగాళ్లకు తెలుస్తొందని ర్యాన్ టెన్ చెప్పుకొచ్చారు. టెస్ట్ క్రికెట్కు సమర్థవంతంగా సిద్దమవ్వాలనే లక్ష్యంతోనే ప్రాక్టీస్లో ఈ పద్దతిని అనుసరిస్తున్నామని చెప్పారు.