ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో టీమిండియా 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. శుభ్మన్ గిల్(387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269) రికార్డ్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా(137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 89), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. వాషింగ్టన్ సుందర్(103 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(3/167) మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్(2/81), జోష్ టంగ్(2/119) రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ తీసారు.
310/5 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓవర్నైట్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా.. ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడారు. బ్యాటింగ్కు అనుకూలంగా మారిన వికెట్పై స్వేచ్చగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా 80 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అతను దూకుడు ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు. మరోవైపు శుభ్మన్ గిల్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేసి 263 బంతుల్లో 150 పరుగుల మార్క్ అందుకున్నాడు.

ఇక సెంచరీ దిశగా సాగిన జడేజాను లంచ్ బ్రేక్కు ముందు జోష్ టంగ్ షార్ట్ పిచ్ డెలివరీతో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 6వ వికెట్కు నమోదైన 203 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సుందర్తో కలిసి ఆచితూచి ఆడిన గిల్ మరో వికెట్ పడకుండా చూసుకున్నాడు. దాంతో భారత్ 419/6 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. తొలి సెషన్లో టీమిండియా 5 ఓవర్లు ఆడి ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది.
రెండో సెషన్లో వాషింగ్టన్ సుందర్తో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సుందర్ కాస్త టైమ్ తీసుకున్నా.. తర్వాత తనదైన శైలిలో బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ 311 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. జోష్ టంగ్ బౌలింగ్లో క్విక్ సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన గిల్.. 348 బంతుల్లో 250 పరుగులు పూర్తి చేసుకొని ట్రిపుల్ సెంచరీ దిశగా సాగాడు. మరోవైపు హాఫ్ సెంచరీ దిశగా సాగిన వాషింగ్టన్ సుందర్(42)ను జోరూట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఏడో వికెట్కు నమోదైన 144 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో ఆకాశ్ దీప్ రాగా.. టీమిండియా 564/7తో టీ బ్రేక్కు వెళ్లింది.
మూడో సెషన్ ఆరంభంలోనే శుభ్మన్ గిల్ జోష్ టంగ్ పెవిలియన్ చేర్చాడు. షార్ట్ పిచ్ బాల్తో బోల్తా కొట్టించాడు. ఆకాశ్ దీప్(6), మహమ్మద్ సిరాజ్(8) వెనువెంటనే ఔటవ్వడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది.