ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో టీమిండియా కీలక వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(84 బంతుల్లో 10 ఫోర్లతో 55)ను జోష్ టంగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కళ్లు చెదిరే బంతితో రాహుల్ మిడిల్ స్టంప్ను లేపేసాడు. ఈ బంతికి కేఎల్ రాహుల్ బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
జోష్ టంగ్ వేసిన 30వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని అంచనా వేయడంలో విఫలమైన కేఎల్ రాహుల్ అడ్డంగా ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. లోపలికి యాంగిల్ అవుతూ వచ్చిన బంతి మిడిల్ స్టంప్ను లేపేసింది. బంతి వేగానికి మిడిల్ స్టంప్ ఎగిరి దూరంగా పడింది. అలా ఎలా బ్యాట్ను మిస్సైందంటూ రాహుల్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిరాశగా పెవిలియన్ చేరాడు.

64/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. నిలకడగా ఆడిన కరుణ్ నాయర్(26)ను బ్రైడన్ కార్స్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శుభ్మన్ గిల్ రాగా.. రాహుల్ 78 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. సెనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన రెండో భారత ఓపెనర్గా నిలిచాడు. జోష్ టంగ్ స్టన్నింగ్ డెలివరీకి రాహుల్ ఔటవ్వగా.. రిషభ్ పంత్తో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 38 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులకు చేరింది.