ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. 608 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో 3 వికెట్లకు 72 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్(2/36), మహమ్మద్ సిరాజ్(1/29) రఫ్పాడించడంతో బెన్ డకెట్(25), జాక్ క్రాలీ(0), జో రూట్(6) పెవిలియన్ చేరారు. క్రీజులో ఓలీ పోప్(24 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్(15 బ్యాటింగ్) ఉన్నారు.
ఆదివారం ఈ మ్యాచ్కు చివరి రోజు కాగా.. టీమిండియా విజయానికి 7 వికెట్లు కావాలి. మరోవైపు ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఇంకా 536 పరుగులు చేయాలి. డ్రా చేసుకోవాలంటే ఆలౌట్ కాకుండా ఆఖరి రోజు 90 ఓవర్ల పాటు ఇంగ్లండ్ బ్యాటింగ్ చేయాలి. చివరి రోజు ఆట తొలి సెషన్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనుంది. ఆఖరి రోజు 90 ఓవర్ల పాటు క్రీజులో నిలబడటం చాలా కష్టం. పిచ్పై పగుళ్లు ఏర్పడితే స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

అంతకుముందు 64/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్లతో 161) మరో భారీ శకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్(84 బంతుల్లో 10 ఫోర్లతో 55), రిషభ్ పంత్(58 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 65), రవీంద్ర జడేజా(118 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(2/93), షోయబ్ బషీర్(2/119) రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు. దాంతో ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)
భారత్ రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్లేర్డ్ (శుభ్మన్ గిల్ 161, జోష్ టంగ్ 2/93)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 72/3(ఓలీ పోప్ 24 బ్యాటింగ్, హ్యారీ బ్రూక్ 15 బ్యాటింగ్)