
లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి రోజు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినా పూర్తి స్థాయి ఆట సాధ్యమైంది. చినుకులు పడి నెమ్మదించిన పిచ్పై భారత బ్యాట్స్మెన్ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్ ఎత్తుగడ పారలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రూట్ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి.
పట్టుదలగా క్రీజ్లో నిలిచిన లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ 127 బ్యాటింగ్), ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 83) భారీ స్కోరుకు పునాది వేశాడు. వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్కు 2 వికెట్లు దక్కాయి.
అయితే ఓపెనర్ల శుభారంభంతో భారీ స్కోర్పై భారత్ కన్నేయగా.. వరుణుడు మాత్రం ఆటంకం కలిగించేందుకు సిద్దంగా ఉన్నాడు. రెండో రోజు అయిన శుక్రవారం కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించాడు. అయితే తొలి రోజు మాదిరే నష్టపోయిన సమయాన్ని పెంచితే పూర్తి స్థాయి ఆట కొనసాగించవచ్చన్నారు.
రెండో రోజు ఆటలో మైదానాన్ని మబ్బులు కమ్మెస్తాయని, చల్లని వాతావరణం ఉంటుందని తెలిపారు. ఈ లెక్కన పరిస్థితులు పేసర్లకు అనూకూలించనున్నాయి. అయితే తొలి రోజు కూడా ఈ తరహా కండిషన్స్లో భారత ఓపెనర్లు అదరగొట్టారు. 126 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంతో లార్డ్స్లో 69 ఏళ్ల రికార్డును అధిగమించారు. పైగా క్రీజులో కుదురుకున్న రాహుల్ సెంచరీతో ఉన్నాడు. అతను గనుక డబుల్ సెంచరీ చేస్తే మాత్రం పరిస్థితులతో సంబంధం లేకుండా భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం.
అయితే ఇంగ్లండ్లో గత కొన్ని రోజులుగా వెదర్ ఫోర్కాస్ట్కు భిన్నంగా జరుగుతుంది. వాతావరణ శాఖ వర్షం వస్తుందంటే రావడం లేదు. రావడం లేదంటే వస్తుంది. ఫస్ట్ టెస్ట్ చివరి రోజు, సెకండ్ టెస్ట్ తొలి రోజు వర్ష సూచన లేదని పేరొనగా.. తీర వరణుడు ఆటకు అంతరాయం కలిగింది. ఈ రోజు కూడా వాతావరణ శాఖ చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. మరీ వర్షం వస్తుందా? లేక రాకుండా ఆటకు సహకరిస్తుందా? అనేది చూడాలి.