టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రిషభ్ పంత్ను మందలించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో రిషభ్ పంత్.. ఫీల్డ్ అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బంతి ఆకారం దెబ్బతిన్నదని, మార్చాలని రిషభ్ పంత్ అంపైర్ను కోరాడు. బాల్ గేజ్ సాయంతో పరిశీలించిన అంపైర్.. బంతిని మార్చేందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహానికి గురైన పంత్.. అంపైర్పై అసహనం వ్యక్తం చేస్తూ బంతిని నేలకేసి కొట్టాడు. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. తన తప్పును పంత్ అంగీకరించడంతో వార్నింగ్తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే విధించి వదిలేసాడు.
గత రెండేళ్లలో రిషభ్ పంత్కు ఇదే తొలి డీమెరిట్ పాయింట్. 24 నెలల వ్యవధిలో ఇలాంటి డీమెరిట్ పాయింట్లు నాలుగు వస్తే.. మ్యాచ్లు ఆడకుండా ప్లేయర్పై నిషేధం విధిస్తారు. నాలుగు డీమెరిట్ పాయింట్లు వస్తే.. ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వన్డే మ్యాచ్లు లేదా రెండు టీ20ల్లో ఏది ముందు వస్తే అది ఆడకుండా నిషేధం విధిస్తారు. ఒక ప్లేయర్ లేదా అతడి సపోర్ట్ పర్సనల్ క్రమశిక్షణా రికార్డులో.. విధించినప్పటి నుంచి ఇరవై నాలుగు నెలల పాటు డీమెరిట్ పాయింట్లు ఉంటాయి. ఆ తర్వాత వాటిని తొలగిస్తారు. రిషభ్ పంత్.. వచ్చే 24 నెలల్లో మరో మూడు డీమెరిట్ పాయింట్స్ అందుకోకూడదు.

భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న ఈ పోరులో 371 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 10 వికెట్ల కావాల్సి ఉండగా.. ఇంగ్లండ్ 350 పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరి రోజు ఆటలో భారత బౌలర్ల ప్రదర్శనపైనే జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నమోదైంది.