ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్లతో 134), శుభ్మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
359/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్కు అదిరిపోయే ఆరంభమే దక్కింది. ఓవర్నైట్ బ్యాటర్లు రిషభ్ పంత్, శుభ్మన్ గిల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా పంత్ తనదైన సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను షోయబ్ బషీర్ వేసిన 100వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలిచి 145 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 99 పరుగుల వద్ద సిక్సర్తో పంత్ సెంచరీ పూర్తి చేసుకోవడం గమనార్హం. ఈ సెంచరీని పంత్ తన ట్రేడ్ మార్క్ పిల్లి మొగ్గతో సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇది పంత్కు ఏడో సెంచరీ కాగా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు.

షోయబ్ బషీర్ వేసిన మరుసటి ఓవర్లోనే శుభ్మన్ గిల్ భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.దాంతో నాలుగో వికెట్కు నమోదైన 209 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ ఓలిపోప్ కళ్లు చెదిరే క్యాచ్కు డకౌట్గా వెనుదిరిగాడు. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ 4 బాల్ డక్గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి ఓవర్లోనే పంత్ ఎల్బీ కావడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్(1) కీపర్ క్యాచ్గా వెనుదిరగడంతో భారత్ 454/7 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్ ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా డకౌటవ్వగా.. జడేజా రెండు బౌండరీలు బాదాడు. కానీ జోష్ టంగ్ ఓకే ఓవర్లో జడేజాతో పాటు ప్రసిధ్ కృష్ణను ఔట్ చేసి భారత తొలి ఇన్నింగ్స్కు తెరదించాడు. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో బంతి స్వింగ్ అయ్యి బౌలింగ్కు అనుకూలించింది. దాంతో 41 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగగా వర్షం అంతరాయం కలిగించింది.