ఇంగ్లండ్ పర్యటనను భారత బ్యాటర్లు ఘనంగా ప్రారంభించారు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 101), శుభ్మన్ గిల్(175 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 127 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిషభ్ పంత్(102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 65 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(78 బంతుల్లో 8 ఫోర్లతో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అరంగేట్ర ప్లేయర్ సాయి సుదర్శన్(0) ఒక్కడే నిరాశపర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు. తొలి రోజు ఆటలో భారత జట్టే పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడు సెషన్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను భారత బ్యాటర్లు చెడుగుడు ఆడారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. బౌలింగ్కు అనుకూలంగా ఉండే ఫస్ట్ సెషన్ కండిషన్స్లో ఓపికగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలను వదిలేసారు. ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. 91 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బ్రైడన్ కార్స్ విడదీసాడు. కేఎల్ రాహుల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో బ్యాటింగ్కు వచ్చిన అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్.. బెన్ స్టోక్స్ వేసిన మరుసటి ఓవర్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. లెగ్ సైడ్ బాల్ను గెలికి మరీ కీపర్ క్యాచ్గా నిష్క్రమించాడు. దాంతో భారత్ 25.4 ఓవర్లలో 92/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్లో జైస్వాల్, గిల్ మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేశారు.ఈ క్రమంలో జైస్వాల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. శుభ్మన్ గిల్ 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్.. బౌండరీల మోత మోగించాడు. 144 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ బాదాడు. ఇది జైస్వాల్కు ఐదో టెస్ట్ సెంచరీ. దాంతో భారత్ 51 ఓవర్లలో 215/2 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
మూడో సెషన్ ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జైస్వాల్ను స్టోక్స్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రిషభ్ పంత్ వచ్చి రావడంతోనే తన ట్రేడ్ మార్క్ బౌండరీతో స్టోక్స్ను బెంబేలెత్తించాడు. మరోవైపు గిల్ తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. పంత్ కాస్త స్లోగా ఆడినా గిల్.. వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 140 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ కాసేపటికే పంత్ కూడా 91 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన పంత్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దాంతో 85 ఓవర్లలో టీమిండియా 3 వికెట్లకు 359 పరుగులతో తొలి రోజు ఆటను ముగించింది.