ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఐదుగురు బ్యాటర్లు శతకాలు నమోదు చేసినా.. 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచినా విజయాన్ని అందుకోలేకపోయింది. చెత్త ఫీల్డింగ్, లోయరార్డ్ వైఫల్యంతో పాటు పసలేని బౌలింగ్, ఇంగ్లండ్ అద్భుతమైన బ్యాటింగ్ భారత్ ఓటమిని శాసించాయి.
ఈ మ్యాచ్లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఐదు శతకాలతో చెలరేగారు. కానీ లోయరార్డర్ బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 430/3 స్కోర్తో పటిష్టంగా కనిపించిన భారత్.. 41 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి 471 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లోనూ 333/4 స్కోర్ నిలిచిన భారత్.. 31 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఈ వైఫల్యంతో ఇంగ్లండ్ ముందు ఈజీ టార్గెట్ నమోదైంది.
తొలి ఇన్నింగ్స్లో 570-580 పరుగులు చేసుంటే మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించేవాళ్లమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి ముందు 430 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నామని, కానీ రెండో ఇన్నింగ్స్లో 25 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్లు కోల్పోయామని గిల్ తెలిపాడు. లోయరార్డర్ బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 100-150 పరుగులు జోడించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఈ మ్యాచ్లో భారత ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి భారత ఆటగాళ్లు దాదాపు 10 క్యాచ్లు నేలపాలు చేశారు. ఇందులో యశస్వి జైస్వాల్ ఒక్కడే రెండు ఇన్నింగ్స్లలో నాలుగు కీలక క్యాచ్లను వదిలేశాడు. ఇందులో బెన్ డకెట్ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు వదిలేసిన క్యాచ్ కూడా ఉంది. ఆ తర్వాత డకెట్ 149 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. రెండో ఇన్నింగ్స్లో బెన్ డకెట్కు మొత్తం మూడు లైఫ్స్ లభించాయి. తొలి ఇన్నింగ్స్లోనూ డకెట్ ఇచ్చిన క్యాచ్ను జడేజా, జైస్వాల్ వదిలేసారు. క్యాచ్లు చేజార్చడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు మరింత స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఇది ఇంగ్లండ్ భారీ స్కోరు చేయడానికి కలిసొచ్చింది. భారత ఆటగాళ్లు వదిలేసిన 10 క్యాచ్ల్లో 5 పట్టినా ఫలితం భారత్కు అనుకూలంగా ఉండేది.
భారత బౌలర్లలో బుమ్రా మినహా ఇతర బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ తీయలేదు. అతని బౌలింగ్ను జాగ్రత్తగా ఆడిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. ఇతర బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీయకపోగా.. ధారళంగా పరుగులిచ్చుకున్నారు. జడేజా సైతం తన స్పిన్తో ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు. పేస్ బౌలర్ల అనుభవలేమి స్పష్టంగా బయటపడింది. ముఖ్యంగా పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. రెండు విభాగాల్లో నిరాశపర్చాడు. భారత బౌలింగ్ విభాగానికి అనుభవం లేదని, వారికి కాస్త సమయం ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.
ఇంగ్లండ్ అసాధారణ బ్యాటింగ్ కూడా టీమిండియా పతనాన్ని శాసించింది. ముఖ్యంగా 371 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(149), జాక్ క్లాలీ(65) తొలి వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేసారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారు.