ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/22) తీన్మార్ బౌలింగ్కు అర్ష్దీప్ సింగ్(2/17), అక్షర్ పటేల్(2/22), హార్దిక్ పాండ్యా(2/42) రెండేసి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే అర్ష్దీప్ సింగ్ షాకిచ్చాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్లో విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ను క్యాచ్ ఔట్ చేసిన అర్ష్దీప్ సింగ్.. తన మరుసటి ఓవర్లో మరో ఓపెన్ బెన్ డక్కెట్(4)ను పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో హ్యారీ బ్రూక్ సాయంతో కెప్టెన్ జోస్ బట్లర్ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఇంగ్లండ్ 2 వికెట్లకు 46 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం రంగంలోకి దిగిన వరుణ్ చక్రవర్తీ ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్(17), లియామ్ లివింగ్ స్టోన్(0)లను క్లీన్ బౌల్డ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 65 పరుగులకే ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన జాకోబ్ బెతెల్(7)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేయగా.. జమీ ఓవర్టన్(2), గస్ అట్కిన్సన్(2)లను తన వరుస ఓవర్లలో అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు జోస్ బట్లర్ దూకుడుగా ఆడుతూ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని జోరుకు వరుణ్ చక్రవర్తీ బ్రేక్ వేసాడు. నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్ సాయంతో పెవిలియన్ చేర్చాడు.
చివర్లో జోఫ్రా ఆర్చర్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయగా.. హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆఖరి బంతికి మార్క్ వుడ్ రనౌటవ్వడంతో ఇంగ్లండ్ 132 పరుగులకే పరిమితమైంది.