బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.
తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది జులైలోనే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా పిలుపు అందుకున్న నితీశ్ కుమార్ రెడ్డి.. గాయం కారణంగా చివరి నిమిషంలో అవకాశాన్ని కోల్పోయాడు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు వరుణ్ చక్రవర్తీ, మయాంక్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నారు.

ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో భాగం కానీ అభిషేక్ శర్మ, జితేశ్ శర్మలు కూడా టీమిండియా పిలుపును అందుకున్నారు. శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన సంజూ శాంసన్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అసాధారణ నైపుణ్యం కలిగిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్లకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన ఈ ఇద్దరికీ చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ ఇద్దరిని ఎంపిక చేయకపోవడం హాట్ టాపిక్గా మారింది. జింబాబ్వే పర్యటనలో రుతురాజ్ గైక్వాడ్ ఆడాడు. చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో భారత్కు సారథిగా వ్యవహరించి బంగారు పతకం అందించాడు.
అయినా అతను రెగ్యూలర్ ఆటగాడిగా అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. ఈ జనరేషన్ ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్కు అసాధారణ నైపుణ్యం ఉందని రికీ పాంటింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసించారు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో రుతురాజ్ ఇండియా సీకి సారథ్యం వహించాడు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈ టోర్నీ ఆడుతుండటంతోనే రుతురాజ్ గైక్వాడ్ బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదని అర్థమవుతోంది. అక్టోబర్ 5 వరకు ఇరానీ కప్ జరగనుండగా.. అక్టోబర్ 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అంతేకాకుండా శుభ్మన్ గిల్ జట్టులో ఉండటంతో రుతురాజ్ గైక్వాడ్కు జట్టులో చోటు లేకుండా పోయింది.
టీ20 ప్రపంచకప్ 2024కు కూడా రుతురాజ్కు బదులు శుభ్మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఇటీవలే గిల్ టీమిండియా వైస్ కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా నిలకడైన బ్యాటింగ్తో రెగ్యులర్ ఓపెనర్గా మారిపోయాడు. దాంతోనే రుతురాజ్కు టీమిండియాలో చోటు లేకుండా పోయింది. ఆస్ట్రేలియా పర్యటనకు రుతురాజ్ గైక్వాడ్ను బ్యాకప్ ఓపెనర్గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
రెస్టాఫ్ ఇండియా టీమ్కు ఇషాన్ కిషన్ కూడా ఎంపికయ్యాడు. బుచ్చి బాబు టోర్నీలో శతకంతో రాణించిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత గాయంతో దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఆడలేదు. రీఎంట్రీ ఇచ్చినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మరోవైపు సంజూ శాంసన్ నిలకడగా రాణించాడు.
అంతేకాకుండా టీమిండియా ప్రధాన వికెట్ కీపర్గా రిషభ్ పంత్ కొనసాగుతుండగా.. అతనికి బ్యాకప్గా టీమిండియా ధ్రువ్ జురెల్ను సిద్దం చేస్తోంది. దాంతోనే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికవ్వలేదు.
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ఎంపికైన భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.