ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా మరో విజయాన్నందుకుంది. బంగ్లాదేశ్తో గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 103 నాటౌట్) అజేయ శతకంతో భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం కంటే.. విరాట్ కోహ్లీ సెంచరీపైనే ఉత్కంఠ నెలకొనడం గమనార్హం.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్లా(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 46), ముష్ఫికర్ రహీమ్(46 బంతుల్లో ఫోర్, సిక్స్తో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

జస్ప్రీత్ బుమ్రా(2/33) మహమ్మద్ సిరాజ్(2/60), రవీంద్ర జడేజా(2/38) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 261 పరుగులు చేసింది. కోహ్లీ అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్ రెండు వికెట్లు తీయగా.. హసన్ మహముద్ ఓ వికెట్ పడగొట్టాడు.

చెలరేగిన రోహిత్, శుభ్మన్: 257 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 48), శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పోటాపడి సిక్సర్లు బాదారు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మ.. హసన్ మహుముద్ బౌలింగ్లో పేలవ షాట్తో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ ఔటైనా.. ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

నోబాల్స్తో షురూ: క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీకి తొలి రెండు బంతులు నోబాల్స్ లభించగా.. ఫోర్, సిక్స్ బాదాడు. హసన్ మీరాజ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ వెనుదిరిగినా.. శ్రేయస్ అయ్యర్(19)తో కలిసి కోహ్లీ చెలరేగాడు. 48 బంతుల్లోహాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. అనంతరం మరింత ధాటిగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్(19) హసన్ మీరాజ్ ఔట్ చేయగా.. మూడో వికెట్కు నమోదైన 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఉత్కంఠ సెంచరీ: క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్తో కలిసి వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత్ విజయం సునాయసం కాగా.. కోహ్లీ సెంచరీపై ఆసక్తి నెలకొంది. భారత్ విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో పూర్తిగా స్ట్రైకింగ్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. క్విక్ డబుల్స్, సింగిల్తో ఆసక్తి రేకెత్తించాడు.మ్యాచ్ ఫలితం ఏమో గానీ.. కోహ్లీ సెంచరీ మార్క్ అందుకోవడంపైనే ఉత్కంఠ నెలకొంది. భారత్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ సెంచరీ 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నసుమ్ వేసిన 42 ఓవర్లో విరాట్ కోహ్లీ సిక్స్ బాది సెంచరీతో పాటు టీమిండియా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.