టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. తొలి ఇన్నింగ్స్లో 6 పరుగులే చేసి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని వెంటాడి స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు.
రెండో ఇన్నింగ్స్లోనైనా సత్తా చాటుతాడని ఆశించిన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మరోసారి సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. 5 పరుగులే చేసిన టాస్కిన్ అహ్మద్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇలా రెండు ఇన్నింగ్స్ల్లో రోహిత్ సింగిల్ డిజిట్కే వెనుదిరగడం అతని కెరీర్లోనే నాలుగోసారి మాత్రమే.

గతంలో 2015లో శ్రీలంకతో జరిగిన టెస్ట్లో, 2015, 2023లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ల్లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. రెండో టెస్ట్లోనైనా రోహిత్ చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.
తొలి ఇన్నింగ్స్లో 6 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అంపైర్ తప్పుడు నిర్ణయంతో పాటు డీఆర్ఎస్ తీసుకోకుండా అలసత్వం ప్రదర్శించడం విరాట్ కోహ్లీ కొంపముంచింది. రీప్లేలో అతను నాటౌట్ అని తేలింది. ఈ మ్యాచ్లో రోహిత్, కోహ్లీ విఫలమైనా.. టీమిండియా పట్టుబిగించింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 23 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(33 బ్యాటింగ్), రిషభ్ పంత్(12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 308 పరుగులకు చేరింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్(5/83) ఐదు వికెట్లు తీయగా.. టాస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. నహిద్ రాణా, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/30), ఆకాశ్ దీప్(2/19), రవీంద్ర జడేజా(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. దాంతో భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.