ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20కి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 12(శనివారం) దసరా పండుగ రోజున ఈ ధనాధన్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను శనివారం(అక్టోబర్ 5)నుంచి ఆన్లైన్లో విక్రయిస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎమ్ ఇన్సైడర్, పేటీఎమ్ యాప్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

టికెట్ల ధర రూ. 750 నుంచి రూ. 15 వేల వరకు ఉందని చెప్పారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ నెల 8వ తేదీ నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డుతో పాటు ఆన్లైట్ టికెట్ బుక్ చేసుకున్న ప్రింట్ చూపించి టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఈసారి ఆఫ్లైన్లో టికెట్లు అమ్మడం లేదని జగన్మోహన్ రావు స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్పై కన్నేసింది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యంగ్ టీమ్ అమీతుమీ తేల్చుకోనుంది. టెస్ట్ సిరీస్ ఆడిన ఆటగాళ్లందరినీ సెలెక్టర్లు టీ20 సిరీస్కు దూరం పెట్టారు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్తో మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.