టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంతోనే బంగ్లాదేశ్తో తొలి టీ20లో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. జట్టులో ప్రతీ ఆటగాడు తమ వంతు ప్రదర్శన చేశారని కొనియాడాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39 నాటౌట్) విధ్వంసంతో 11.5 ఓవర్లలోనే చేధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్దీ హసన్ మీరాజ్(32 బంతుల్లో 3 ఫోర్లతో 35 నాటౌట్), నజ్ముల్ హెస్సేన్ షాంటో(25 బంతుల్లో ఫోర్, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/31), అర్ష్దీప్ సింగ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్యా(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 29), సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 29) దూకుడుగా ఆడారు. హార్దిక్ పాండ్యాతో కలిసి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(16 నాటౌట్) అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్లు తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయం స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. సమష్టి ప్రదర్శనతో విజయం సాధించామని చెప్పాడు. 'మా నైపుణ్యాలకు తగ్గట్లు ఆడే ప్రయత్నం చేశాం. టీమ్ మీటింగ్స్లో మేం రచించిన వ్యూహాలు ఫలించాయి. ఈ కొత్త గ్రౌండ్లో మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేం బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం.
మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది కెప్టెన్గా నాకు తలనొప్పి అయ్యింది. ఎప్పుడైనా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిది. ప్రతీ మ్యాచ్తో ఏదో ఒక విజయాన్ని నేర్చుకోవచ్చు. కొన్ని విషయాల్లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. తదుపరి మ్యాచ్ గురించి కూడా కూర్చోని మాట్లాడుకుంటాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.