బంగ్లాదేశ్తో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశాడు.
తుది జట్టులో ఏకైక మార్పు చేశామని చెప్పిన సూర్య.. అర్ష్దీప్ సింగ్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు. 'చూడటానికి పిచ్ బాగుంది. ముందుగా బ్యాటింగ్ చేసి మా లక్ష్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. క్రికెట్ అభిమానులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న తర్వాత కూడా ఈ మ్యాచ్కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవ్వడం సంతోషంగా ఉంది.

విజయాల అలవాటును కొనసాగించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు సిరీస్ గెలిచిన తర్వాత అలసత్వం రావచ్చు. మ్యాచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా మా బ్యాటర్లకు మేం పూర్తి స్వేచ్చనివ్వాలనుకుంటున్నాం. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. అర్ష్దీప్ సింగ్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకున్నట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
తెలుగు తేజం తిలక్ వర్మకు అవకాశం దక్కుతుందని భావించినా అతనికి నిరాశే ఎదురైంది. సిరీస్ గెలిచినా.. టీమిండియా మేనేజ్మెంట్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వలేదు. మరోవైపు టాస్ గెలిచినా తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో అన్నాడు. ముందుగా బౌలింగ్ చేయడం పెద్ద సమస్యే కాదన్నాడు. 'మా బ్యాటింగ్ విభాగం కాస్త బాధ్యతగా రాణించాల్సి ఉంది. ఈ రోజు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా. నిలకడగా రాణించడం మేం నేర్చుకోవాలి. ఈ మ్యాచ్లో 40 ఓవర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ఆశిస్తున్నా.'అని నజ్ముల్ హోస్సేన్ షాంటో చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
బంగ్లాదేశ్: పెర్వెజ్ హోస్సేన్ ఎమోన్, లిటన్ దాస్(కీపర్), నజ్ముల్ హోస్సేన్ షాంటో, తాంజిద్ హసన్, టౌహిడ్ హృదయ్, మహ్మదుల్లా, మెహ్దీ హసన్, టస్కిన్ అహ్మద్, రిషద్ హోస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ షకీబ్
భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్