బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగే రెండో టీ20లో బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీ20 తరహాలోనే ఈ మ్యాచ్లోనూ విజయం సాధించాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా భావిస్తుండగా.. ఎలాగైనా గెలవాలనే కసితో బంగ్లాదేశ్ ఉంది. దాంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తినెలకొంది.
మరోవైపు ఈ మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్ను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. రెండో టీ20లో అతను 39 పరుగులు చేస్తే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ను సమం చేస్తాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీతో సమంగా నిలుస్తాడు.

విరాట్ కోహ్లీ 73 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధింగా.. సూర్యకుమార్ యాదవ్ కూడా రెండో టీ20ల్లో 39 పరుగులు చేస్తే 73 మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకుంటాడు. బంగ్లాదేశ్తో రెండో టీ20 సూర్యకు 73వ మ్యాచ్. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 67 మ్యాచ్ల్లో 2500 పరుగులు చేశాడు.
ఇక అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3500 పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం కోహ్లీ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
రెండో టీ20లోనూ టీమిండియా హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాళ్లు లేకున్నా.. కుర్రాళ్లు సత్తా చాటడంతో తొలి టీ20లో టీమిండియా విజయం సాధించింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ శుభారంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. రెండో టీ20లోనూ టీమిండియా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.
అరంగేట్ర మ్యాచ్లోనే టీమిండియా పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ అదరగొట్టాడు. మరో అరంగేట్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం కాస్త తడబడ్డాడు. జట్టులో ప్లేస్ సుస్థిరం కావాలంటే రెండో టీ20లో రాణించడం నితీష్ కుమార్ రెడ్డికి కీలకం. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి విధ్వంసం సృష్టిస్తే టీమిండియాకు తిరుగుండదు. మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తీ తొలి టీ20లోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న టీమిండియా సన్నాహకాలు కూడా పూర్తి చేసుకుంది.