మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్మురేపింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం హోరాహోరీగా సాగిన రెండో టీ20లో భారత అమ్మాయిలు 8 పరుగుల తేడాతో గెలుపొందారు. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించిన ఈ లోస్కోరింగ్ మ్యాచ్లో షెఫాలీ వర్మ(3/15) సంచలన ప్రదర్శనతో ఓటమి తప్పించుకున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేసింది. షెఫాలీ వర్మ(19) టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(0) గోల్డెన్ డక్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన(13), జెమీమా రోడ్రిగ్స్(8), యస్తికా భాటియా(11), హర్లీన్ డియోల్(6), దీప్తి శర్మ(10), అమన్జోత్(14) దారుణంగా విఫలమయ్యారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖటున్ మూడు వికెట్లు తీయగా.. ఫహిమా ఖాటున్ రెండు వికెట్లు పడగొట్టింది. మరుఫా అక్తర్, నహిదా అక్తర్, రెబెయా ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నిగర్ సుల్తాన్(38) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షెఫాలీ వర్మ(3/15), దీప్తి శర్మ(3/12) మూడేసి వికెట్లతో సత్తా చాటగా.. మిన్ను మణి రెండు వికెట్లు తీసింది. తెలుగు తేజం బారెడ్డి అనూషకు ఓ వికెట్ దక్కింది.
లక్ష్యచేధనలో 86/5తో పటిష్టంగా కనిపించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తాన్ వికెట్తో పేక మేడలా కుప్పకూలింది. దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్ ఐదో బంతికి ఆమె స్టంపౌట్ అవ్వగా.. షెఫాలీ వర్మ వేసిన ఆఖరి ఓవర్లో బంగ్లాదేశ్ చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.
6 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో షెఫాలీ వర్మ వేసిన తొలి బంతికి రెబెయా ఖాన్(0) రనౌట్ అయ్యింది. రెండో బంతికి నహిదా అక్తర్(6) క్యాచ్ ఔటవ్వగా.. మూడో బంతి డాట్ అయ్యింది. నాలుగో బంతికి ఫహిమా ఖాన్ రిటర్న్ క్యాచ్గా వెనుదిరగ్గా.. ఐదో బంతి డాట్ అయ్యింది. చివరి బంతికి మరుఫా అక్తర్ స్టంపౌటవ్వడంతో బంగ్లాదేశ్ ఆలౌటైంది.
ఈ ఒక్క ఓవర్లోనే షెఫాలీ వర్మకు మూడు వికెట్లు దక్కాయి. చివరి 6 బంతుల్లో బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం.