టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్కు మళ్లీ నిరాశే ఎదురుకానుంది. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్కు ఎంపికైన ఈ ముంబై క్రికెటర్ చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ను ఆడించడంతో సర్ఫరాజ్ ఖాన్ బెంచ్కే పరిమితమయ్యాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్కు ఎంపిక చేసిన జట్టునే బీసీసీఐ.. రెండో మ్యాచ్కు కొనసాగించింది. దాంతో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం కనిపించడం లేదు.

అంతేకాకుండా అక్టోబర్ 1 నుంచి ఇరానీ కప్ జరగనుంది. రంజీ ట్రోఫీ 2024 విజేత ముంబై జట్టు.. రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయ్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ టోర్నీ కోసం సర్ఫరాజ్ ఖాన్ను భారత జట్టు నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
అదే జరిగితే రెండో టెస్ట్కు భారత తుది జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రెండో టెస్ట్కు వేదికైన కాన్పూర్ పిచ్ సహజంగా స్పిన్కు అనుకూలిస్తోంది. కానీ చెన్నై తరహాలోనే స్పిన్, పేస్, బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే రెడ్ సాయిల్ పిచ్ను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.
సర్ఫరాజ్ ఖాన్ రిలీజ్ చేసే విషయంపై భారత సెలెక్షన్ కమిటీ ఇంకా తుద నిర్ణయం తీసుకోలేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. 'ఈ అంశాన్ని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. రెండో టెస్ట్కు ముందు చివరి క్షణంలో నెట్స్లో ఎవరికైనా గాయాలైనా.. ప్రధాన బ్యాటర్లకు ఫిట్నెస్ సమస్యలు తలెత్తినా.. సర్ఫరాజ్ ఖాన్ను ఆడించవచ్చు.
తొలి టెస్ట్ ఆడిన ఆటగాళ్లంతా అందుబాటులో ఉంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్ను భారత జట్టు నుంచి రిలీజ్ చేస్తారు. ఇరానీ ట్రోఫీ ఆడేందుకు అతనికి అనుమతిస్తారు. ఇక కాన్పూర్ నుంచి లక్నోకు కేవలం గంట ప్రయాణం మాత్రమే. తుది జట్టుపై మ్యాచ్కు ముందే నిర్ణయం తీసుకోనున్నారు. రెండో టెస్ట్ ప్రారంభమైన తర్వాతే సర్ఫరాజ్ ఖాన్ను జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.