టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. బంగ్లాదేశ్తో ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో సంజూ శాంసన్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో సంజూ శాంసన్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 111 పరుగులు చేసాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ను సంజూ శాంసన్ అధిగమించాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన జాబితాలో సూర్యను వెనక్కి నెట్టి సంజూ శాంసన్ రెండో స్థానంలో నిలిచాడు.

ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 45 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఈ రికార్డ్ను సంజూ శాంసన్ తాజా ఇన్నింగ్స్తో అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 35 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు.
రోహిత్ రికార్డ్ బద్దలు..
తొలి రెండు టీ20ల్లో 29, 10 పరుగులతో విఫలమైన సంజూ శాంసన్.. ఆఖరి టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టీమ్మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రిషద్ హోస్సేన్ వేసిన 10 ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా సంజూ శాంసన్ నిలిచాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డ్ను అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో 29 పరుగులు చేశాడు. తాజాగా సంజూ శాంసన్ వరుసగా 5 సిక్స్లు బాది 30 పరుగులతో రోహిత్ శర్మను అధిగమించాడు.
టీమిండియా రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 111) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) మెరుపులు మెరిపించారు. ఈ భారీ స్కోర్తో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు అత్యంత వేగంగా 100, 150, 200, 250 పరుగుల మార్క్ను అందుకున్న జట్టుగా చరిత్రకెక్కింది.