బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ కోసం తాము అన్ని విధాల సిద్దమయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ సిరీస్ను ఉద్దేశించి బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలపై స్పందించమని, మైదానంలోనే చూసుకుంటామని చెప్పాడు. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై వేదికగా గురువారం(సెప్టెంబర్) నుంచి ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మ.. మంగళవారం మీడియాతో మాట్లాడాడు. 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా బరిలోకి దిగుతుండటంతో తన సన్నాహకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై వేదికగా నిర్వహించిన ప్రాక్టీస్ క్యాంప్లో తీవ్రంగా కష్టపడ్డామని చెప్పిన రోహిత్.. టెస్ట్ సీజన్ కోసం అన్ని విధాల సిద్దమయ్యామని చెప్పాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను తాము తేలికగా తీసుకోవడం లేదని, ప్రతీ మ్యాచ్ తమకు కీలకమేనని స్పష్టం చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్... తమ జట్టులోనే క్లాస్ ప్లేయరని ప్రశంసించాడు.

'మాకు ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. మేం ప్రతీ గేమ్ గెలవాలనుకుంటున్నాం. ఈ సిరీస్ మాకు రిహార్సల్ కాదు. ప్రతీ మ్యాచ్తో పాటు సిరీస్ మాకు ముఖ్యమే. ఈ సిరీస్ను కూడా మేం గెలవాలనుకుంటున్నాం. జట్టులోకి అందరూ తిరిగిరావడం బాగుంది. ప్రతీ ఆటగాడు అందుబాటులో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. మేం విజయంతో మా టెస్ట్ సీజన్ను ప్రారంభించాలనుకుంటున్నాం.
ఈ సిరీస్ కోసం మేం అన్ని విధాల సిద్దమయ్యాం. చెన్నై వేదికగా ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో కష్టపడ్డాం. నెట్స్లో గంటలకొద్దీ గడిపాం. కొంతమంది ఆటగాళ్ల దులీప్ ట్రోఫీ కూడా ఆడారు. ఈ టెస్ట్ సీజన్ కోసం మేం అన్ని విధాల సన్నదమయ్యాం. సిద్దంగా ఉన్నాం.
కేఎల్ రాహుల్ క్లాస్ ప్లేయర్. అతని నైపుణ్యం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అతను నిలకడగా ఆడుతున్నాడు. సౌతాఫ్రికాలో శతకం సాధించాడు. గాయంతో తాను ఆడిన చివరి టెస్ట్లోనూ 80 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో అదే ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. కేఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్ బాగా ఆడగలడు. అతను మరింత మెరుగ్గా రాణిస్తాడని అనుకుంటున్నా. అతను టెస్ట్ క్రికెట్లో రాణించలేడని చెప్పడానికి ఒక్క కారణం కూడా నా దగ్గర లేదు.
భవిష్యత్తు కోసం యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్లను సిద్దం చేస్తున్నాం. ఇప్పటికే యశస్వి జైస్వాల్ తన సత్తా ఏంటో తెలియజేశాడు. కఠిన పరిస్థితుల్లోనూ అద్భుతంగా ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ నిర్భయంగా ఆడుతున్నారు.
ప్రతీ జట్టుకు భారత్ను ఓడించాలని ఉంటుంది. అన్నీ జట్లు భారత్ను ఓడించడాన్ని ఆస్వాదిస్తాయి. బంగ్లాదేశ్ను కూడా తమ మాటలతో ఆస్వాదించనివ్వండి. ఇంగ్లండ్ కూడా ఇలానే సిరీస్ ప్రారంభానికి ముందు చాలా మాట్లాడింది. మేం ఈ సవాళ్లను ఏ మాత్రం పట్టించుకోం. మైదానంలో మా ఆటతోనే బదులిస్తాం. మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.